న్యూఢిల్లీ : చైనా లోన్ యాప్ల ఆగడాలపై మోదీ సర్కార్ మౌనం దాల్చుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. దేశంలో లక్షలాది మందిని అప్పుల పాలు చేస్తూ చైనా లోన్ యాప్లు రూ 500 కోట్లను దారిమళ్లించాయని పేర్కొంది. డ్రాగన్ లోన్ యాప్లు తమ నిర్వాకంతో 52 మంది యువకులను బలి తీసుకున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. చైనా యాప్ల దారుణాలకు కళ్లెం వేసేందుకు మోదీ ప్రభుత్వం వద్ద ఎలాంటి వ్యూహం లేదని మండిపడింది.
2021 జనవరి, ఫిబ్రవరి మధ్య చేపట్టిన విచారణలో వివిధ ప్లేస్టోర్లలో దాదాపు 1100 డిజిటల్ లోన్ యాప్స్ అందుబాటులో ఉన్నట్టు వెల్లడైందని పేర్కొంది. వీటిలో 600 యాప్లు అక్రమంగా పనిచేస్తున్నాయని ఆర్బీఐ అంగీకరించిందని కాంగ్రెస్ ప్రతినిధి గౌరవ్ వల్లభ్ అన్నారు. 2017, 2020 మధ్య డిజిటల్ లోన్ యాప్స్ 12 రెట్లు పెరిగాయని ఆర్బీఐ వెల్లడించిందని చెప్పారు. ఈ లోన్ యాప్ల ఆగడాలు, బెదిరింపులతో భారత్లో 52 మంది యువకులు బలయ్యారని ఆయన ఆరోపించారు.
చైనా లోన్ యాప్లు లక్షల మంది భారతీయులను అప్పుల ఊబిలోకి నెట్టివేశాయని అన్నారు. లడఖ్లో చైనా దళాలు చొచ్చుకువచ్చినా మోదీ సర్కార్ నోరు మెదపడం లేదని, అంతర్జాతీయంగా దౌత్య సంప్రదింపుల్లోనూ ఘోరంగా విఫలమైందని అన్నారు. దేశ ఆర్ధిక వ్యవస్ధను నిర్వీర్యం చేసిన మోదీ ప్రభుత్వం లక్షలాది మందిని పేదరికంలోకి నెట్టేసిందని గౌరవ్ వల్లభ్ ఆవేదన వ్యక్తం చేశారు.