ముంబై : ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మద్దతు తెలపడం మహా వికాస్ అఘడి (ఎంవీఏ)లో అగ్గి రాజేస్తోంది. ద్రౌపది ముర్మును బలపరచాలని శివసేన తీసుకున్న వైఖరిపై మహారాష్ట్రలో సేన భాగస్వామి కాంగ్రెస్ భగ్గుమంటోంది. ద్రౌపది ముర్ముకు ఠాక్రే మద్దతు తెలపడం పట్ల రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత బాలాసాహెబ్ థొరట్ ఆందోళన వ్యక్తం చేశారు.
సిద్ధాంతాల నుంచి శివసేన పక్కకు జరగడం పట్ల కాంగ్రెస్ నేత ప్రశ్నలు లేవనెత్తుతూ ట్వీట్ చేశారు. రాష్ట్రపతి ఎన్నిక భిన్న సిద్ధాంతాల మధ్య పోరుగా మారిందని, ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగాన్ని కాపాడేందుకు పోరాటాలు సాగుతున్నాయని బాలాసాహెబ్ థొరట్ గుర్తుచేశారు. ఇది మహిళ, పురుషుడి మధ్య పోరాటమో, గిరిజన-గిరిజనేతరుల మధ్య పోరాటమో కాదని స్పష్టం చేశారు. శివసేన ఎందుకు ద్రౌపది ముర్మును సమర్ధిస్తున్నదో స్పష్టం చేయాలని కాంగ్రెస్ నేత వరుస ట్వీట్లలో నిలదీశారు.
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధికి మద్దతు ఇచ్చే ముందు ఎంవీఏలో చర్చించలేదని, తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్రజాస్వామిక పద్ధతిలో మహారాష్ట్రలో ఎంవీఏ సర్కార్ను కూల్చి, శివసేన ఉనికినే సవాల్ చేసిన కాషాయ కూటమికి రాష్ట్రపతి ఎన్నికల్లో శివసేన ఎలా మద్దతు ఇస్తుందని ప్రశ్నించారు. ద్రౌపది ముర్ముకు మద్దతిచ్చే విషయంలో ఎంవీఏకు శివసేన ముందస్తు సమాచారం ఇవ్వలేదని కూటమిలో మరో భాగస్వామ్య పక్షమైన ఎన్సీపీ పేర్కొంది.