న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల తేదీ దగ్గరపడింది. సీనియర్ నాయకులు మల్లిఖార్జున్ ఖర్గే, శశిథరూర్ ప్రధాన అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. ప్రచారం జోరందుకుంది. కానీ, గాంధీల కుటుంబం మద్దతు మాత్రం ఖర్గేకు ఉన్నదని ప్రచారం జరుగుతున్నది. శశిథరూర్ గతంలో మరో 22 మంది సీనియర్ నేతలతో కలిసి సోనియాగాంధీకి లేఖ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడి కొరతపై ఆ లేఖలో ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో గాంధీ ఫ్యామిలీ థరూర్ పార్టీ అధ్యక్షుడు కావాలని కోరుకోదని విశ్లేషణలు వెలువడుతున్నాయి.
ఇదే విషయాన్ని మీడియా ప్రతినిధులు ఖర్గే ముందు ప్రస్తావించగా ఆయన కొట్టిపారేశారు. పార్టీ అధ్యక్ష ఎన్నికల విషయంలో గాంధీ ఫ్యామిలీ న్యూట్రల్గా ఉంటుందని చెప్పారు. పూర్తిగా పక్షపాత రహితంగా ఎన్నికలు జరుగుతాయన్నారు. గాంధీ కుటుంబానికి పోటీదారులంతా సమానమేనని, వారు ఎవరి పక్షం వహించరని చెప్పారు.
పార్టీకి అధ్యక్షుడిగా పనిచేయాలన్న ఆశ తనకు లేదని, కానీ పార్టీలోని ప్రతి వర్గం తనను పోటీ చేయమని కోరిందని, అందుకే బరిలో దిగానని ఖర్గే వెల్లడించారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి, కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి తాను పోటీకి ఒప్పుకున్నానని చెప్పారు.