Congress Party | న్యూఢిల్లీ : కక్షపూరితంగానే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ( Rahul Gandhi ) పై బీజేపీ ప్రభుత్వం( BJP Govt ) అనర్హత వేటు వేసిందని కాంగ్రెస్ పార్టీ( Congress Party ) పేర్కొంది. రాహుల్పై అనర్హత వేటు వేసిన మోదీ( Modi )పై మూడు విధాలుగా పోరాటం చేస్తామని ఆ పార్టీ ప్రకటించింది. రాహుల్పై అనర్హత వేటు వేయడంతో.. కాంగ్రెస్ పార్టీ అత్యవసరంగా ఢిల్లీలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించింది. రెండు గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.
సమావేశం ముగిసిన అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్( Jairam Ramesh ) మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ( PM Modi ) ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాహుల్ అనర్హత వేటు అంశంపై పోరాడేందుకు ముఖ్య నేతలతో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మోదీపై మూడు విధాలుగా పోరాటం చేయాలని పార్టీ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. న్యాయ పోరాటం( Leagal Fight ), దేశవ్యాప్త వీధి పోరాటం, విపక్షాలను కలుపుకొని పోరాటం చేయాలని నిర్ణయించిందన్నారు. రాహుల్పై అనర్హత వేటు అంశాన్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్తామన్నారు. కక్షపూరితంగానే రాహుల్పై అనర్హత వేటు వేశారని జైరాం రమేశ్ పేర్కొన్నారు. ఏఐసీసీ( AICC ) రేపు ఉదయం కార్యాచరణను ప్రకటించనుంది.
ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, మాజీ ప్రెసిడెంట్ సోనియా గాంధీ, మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరం, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీలు ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, రాజీవ్ శుక్లా, తరీఖ్ అన్వర్, సీనియర్ నాయకులు ఆనంద్ శర్మ, అంబికా సోనీ, ముకుల్ వాస్నిక్, సల్మాన్ ఖుర్షీద్, పవన్ కుమార్ బన్సాల్తో పాటు పలువురు పాల్గొన్నారు.