BJP | బెంగళూరు, మార్చి 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పరువు నష్టం కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ లోక్సభ సభ్యత్వాన్ని పార్లమెంటు సెక్రటేరియట్ ఆగమేఘాలమీద రద్దుచేసింది. కానీ, కర్ణాటకలో జైలు శిక్ష పడిన ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల విషయంలో మాత్రం అక్కడి అసెంబ్లీ అధికారులు చర్యలు తీసుకొనేందుకు వణికిపోతున్నారు. రాహుల్గాంధీకి సూరత్ న్యాయస్థానం రెండేండ్ల జైలు శిక్ష విధించిన మరుసటి రోజే-శుక్రవారం ఆయన లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు. కర్ణాటకలో ఇద్దరు ఎమ్మెల్యేలకు కోర్టులు శిక్ష విధించి కూడా రెండు నెలలు అవుతున్నది.
ఇప్పటివరకూ వారి సభ్యత్వాలు రద్దు కాలేదు. పైపెచ్చు వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీకి వారు సన్నాహాలు చేసుకొంటున్నారు. హావేరీ పట్టణంలో అభివృద్ధి పనుల అమల్లో అవినీతికి పాల్పడిన నేరానికి హావేరీ బీజేపీ ఎమ్మెల్యే నెహ్రూ ఓలేకర్, ఆయన కుమారులు మంజునాథ్ ఓలేకర్, దేవరాజ్ ఓలేకర్కు న్యాయమూర్తి జయంత్కుమార్ గత నెల 13న రెండేండ్ల జైలు శిక్ష, రూ.1,000 చొప్పున జరిమానా విధించారు. హావేరీ పట్టణంలో కాంక్రీట్ రహదార్ల నిర్మాణం, ఇతర పనులను ఓలేకర్ తన కుమారులకే కాంట్రాక్టుకు ఇప్పించి రూ.50 లక్షల మేరకు అవినీతికి పాల్పడినట్టు నేరం రుజువైంది. నెహ్రూ ఓలేకర్కు బెయిల్ మంజూరు చేశారు.
చెక్ బౌన్స్ కేసులో చిక్మగళూరు జిల్లా మూడిగెరె బీజేపీ ఎమ్మెల్యే ఎంపీ కుమారస్వామికి ఇకడి ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం నాలుగేండ్ల జైలు శిక్ష విధించింది.
హెచ్ఆర్ హూవప్ప గౌడ అనే వ్యక్తి నుంచి కుమారస్వామి రూ.1,38,65,000 కోట్ల రుణం తీసుకొని చెల్లని చెక్కులు ఇచ్చినందుకు న్యాయమూర్తి జీ ప్రీత్ గత నెల 13న నాలుగేండ్ల జైలు శిక్ష విధించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కుమారస్వామి ప్రయత్నాలు మొదలుపెట్టారు. వీరి సభ్యత్వ రద్దుపై కర్ణాటక అసెంబ్లీ అధికారులు నోరు మెదుపటం లేదు.