Congress | రానున్న లోక సభ ఎన్నికల బరి దించేందుకు కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల జాబితాను తయారు చేసే పనిలో బిజీగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మూడ్లోకి వచ్చేసింది. మార్చి మొదటి వారంలో పార్టీ మేనిఫెస్టోతో పాటు పోటీచేయబోయే నియోజక వర్గాలలో అభ్యర్ధులను కూడా ప్రకటించనుంది. పార్టీ నేతల సమాచారం ప్రకారం కాంగ్రెస చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం వచ్చే నెల ఒకటి, రెండు తేదీల్లో జరిగే అవకాశం ఉందని, అందులో అభ్యర్థుల తొలి జాబితాకు ఆమోద ముద్ర వేస్తారని తెలుస్తున్నది.
కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం నేతృత్వంలోని మేనిఫెస్టో కమిటీ మార్చి 4న ముసాయిదాను ఖరారు చేయనుందని, దానికి త్వరలోనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదం తెలపనుంది. ఏఐసీసీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు మాట్లాడుతూ, `సిట్టింగ్ తిరిగి ఎన్నికల్లో పోటీ చేయించాలని సీడబ్ల్యుసీ నిర్ణయిస్తే, ఆయా స్థానాల్లో పార్టీ అభ్యర్థులను సులభంగా ఖరారవుతుంది. అభ్యర్ధిని మార్చాలని అనుకున్నట్లయితే కొత్త వ్యక్తిని గుర్తించ టానికి కొంత కసరత్తు చేయాల్సి వస్తుంది` అని చెప్పారు.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం వివిధ స్క్రీనింగ్ కమిటీల సిఫార్సులతో పాటు, పార్టీ అంతర్గత సర్వే కూడా చేయించిందని, వాటి ఆధారంగానే అభ్యర్ధుల ఖరారు జరుగుతున్నాదని ఒక అగ్రనాయకుడు తెలిపారు. అభ్యర్ధుల ఎంపికలో ఈ సారి ఆ రిపోర్టులే కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు. మార్చి మొదటి వారంలో తొలి జాబితాకు పార్టీ ఆమోదం పొందే అవకాశం ఉందని, ఆ తరువాత పార్టీ హై కమాండ్ అభ్యర్థులను అప్రమత్తం చేస్తుందని, ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత వ్యూహాత్మకంగా పేర్లను ప్రకటించవచ్చని అంటున్నారు.
మార్చి 13 తర్వాత ఎప్పుడైనా ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల తేదీలను ప్రకటించవచ్చు , అందుకు తాము సిద్ధంగా ఉండాలి అని ఓ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత చెప్పారు. ఇదిలా ఉండగా ఎన్నికల మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశం జనవరి 4న జరిగిందన్న విషయం తెలిసిందే. రైతులు, వృత్తిదారులు, విద్యార్థులు, మహిళలు, కార్మికులు మొదలైన వివిధ సామాజిక వర్గాలతో కూడా సభ్యులు విడివిడిగా సంభాషించి వారి అభిప్రాయాలను సేకరించారు. ముసాయిదాను మార్చి 4న ప్యానెల్ చర్చించి ఆమోదిస్తుందని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ టీఎస్ సింగ్ డియో చెప్పారు. మేనిఫెస్టో కమిటీలో ప్రియాంక గాంధీ వాద్రా కూడా సభ్యురాలిగా ఉన్నందున, ముసాయిదాలో మహిళా ఓటర్లకు తగినన్ని హామీలు కూడా ఉంటాయని పార్టీ సమాచారం.
మేనిఫెస్టో కమిటీ అధ్యక్షులుగా మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఉండడంతో పార్టీ మ్యానిఫెస్టోలో వ్యవస్థలో సంస్కరణలు, నిజమైన అభివృద్ధిని నిర్ధారించడానికి కాంగ్రెస్ తీసుకురానున్న విధాన మార్పులను కూడా జాబితాలో చేర్చే అవకాశం ఉంది. ఎన్నో ఏండ్లుగా చిదంబరం, జైరాం రమేష్ వంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను ఎత్తి చూపుతున్నారు. సమాజంలోని వివిధ వర్గాల అభివృధ్ధి సమానంగా జరగలేదని, ఆర్ధిక ప్రయోజనాలు కూడా బడుగులకు సమానంగా పంపిణీ చేయబడలేదని చెప్పారు.ఆర్థిక వ్యవస్థ మందగమనానికి గత యూపీఏ ప్రభుత్వమే కారణమన్న కేంద్రం ఆరోపణలనూ తోసిపుచ్చారు.