Congress Party | కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. నాలుగేళ్లపాటు రీఅసెస్మెంట్ ప్రొసీడింగ్స్ ప్రారంభించాలన్న ఆదాయపు పన్ను శాఖ ఆదేశాలను సవాలు చేస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. 2014-2017 మధ్య పన్నుల రీవాల్యుయేషన్పై కాంగ్రెస్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. జస్టిస్ యశ్వంత్ వర్మ, జస్టిస్ పురుషేంద్ర కుమార్ కౌరవ్లతో కూడిన డివిజన్ బెంచ్ పిటిషన్లను తిరస్కరించింది.
2014-15, 2015-16, 2016-17 అసెస్మెంట్ సంవత్సరాలకు సంబంధించి రీ-అసెస్మెంట్ ప్రొసీడింగ్లను సవాలు చేస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్లను మార్చి 22న కోర్టు కొట్టివేసింది. ఐటీశాఖ తాజాగా పరిశీలన ప్రారంభించిన ఇతర అసెస్మెంట్ సంవత్సరాలకు సంబంధించిన తాజా నాలుగు పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో టాక్స్ అథారిటీ ఎలాంటి చట్టబద్దమైన నిబంధనల్ని ఉల్లంఘించలేదని.. పార్టీ ఆదాయం రూ.520 కోట్ల కంటే ఎక్కువగా ఉందని కోర్టు పేర్కొంది. కాంగ్రెస్ రిట్ పిటిషన్లను కొట్టివేస్తున్నామని తెలిపింది.ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో ఉన్న రూ.105 కోట్లను ఐటీశాఖ ఫ్రీజ్ చేసిన విషయం తెలిసిందే. ఫ్రీజ్ చేసిన నిధులను రిలీజ్ చేయాలంటూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టేవేసిన విషయం తెలిసిందే.
2018-19 అసెస్మెంట్ ఇయర్కు సంబంధించి రూ.102 కోట్ల బకాయి పన్నును రికవరీ చేయాలని ఐటీశాఖ కాంగ్రెస్కు నోటీసులు జారీ చేసింది. అయితే దీనిపై స్టే విధించాలని హస్తం పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ (ITAT) నోటీసుపై జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ.. స్టే కోరుతూ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. అయితే, పార్టీ నుంచి రూ.65.94 కోట్ల మొత్తాన్ని రికవరీ చేయడంతో పాటు ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, ఐటీఏటీ ఎదుట స్టే కోసం దరఖాస్తు దాఖలు చేసేందుకు కాంగ్రెస్కు అనుమతి ఇచ్చింది. స్టే కోసం తాజా దరఖాస్తును తరలించడానికి కోర్టు కాంగ్రెస్ను అనుమతించింది.