భోపాల్/జైపూర్/రాయ్పూర్, డిసెంబర్ 3: మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. మూడు రాష్ర్టాల్లోనూ బీజేపీ సంపూర్ణ మెజార్టీ సాధించి విజయకేతనం ఎగురవేసింది. వీటిల్లో తాము అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్లను హస్తం పార్టీ చేజార్చుకొన్నది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో ఆయా రాష్ర్టాల్లో బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు నిర్మానుష్యంగా కనిపించాయి.
మధ్యప్రదేశ్లో కమలం పార్టీ అధికారాన్ని నిలబెట్టుకున్నది. 230 స్థానాలకుగానూ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ కంటే భారీ స్థాయిలో 163 స్థానాల్లో గెలుపొందింది. ఇక రాజస్థాన్(199)లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ను పడగొట్టిన బీజేపీ 115 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. ఛత్తీస్గఢ్లో ఎగ్జిట్పోల్స్ అంచనాలకు విరుద్ధంగా బీజేపీ అనూహ్య విజయం సాధించింది. 90కిగానూ 54 నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు.
దీంతో ఇటీవల జరిగిన ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరాదిన మూడు రాష్ర్టాల్లో బీజేపీ విజయం సాధించి తన పట్టును చాటింది. మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్కు, ఆ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమికి ఈ ఎన్నికల ఫలితాల ద్వారా తగిన గుణపాఠం చెప్పామన్నారు.
అవినీతిలో మునిగిన ఆ పార్టీకి ప్రజలు గట్టి హెచ్చరిక చేశారని పేర్కొన్నారు. ఈ మూడు విజయాలు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందన్న దానికి గ్యారెంటీ అని చెప్పారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో బీజేపీని గెలిపించినందుకు మోదీ అంతకుముందు ఎక్స్ ద్వారా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. దేశ ప్రజలు సుపరిపాలన, అభివృద్ధి వైపు నిలబడుతారనే దాన్ని ఈ ఫలితాలు నిరూపించాయని అభిప్రాయపడ్డారు.
మధ్యప్రదేశ్లో బీజేపీ ఐదోసారి..
మధ్యప్రదేశ్లో బీజేపీ తన పట్టును కొనసాగించింది. 230 నియోజకవర్గాలకుగానూ సునాయసంగా మెజార్టీ మార్క్ సాధించింది. 163 స్థానాల్లో విజయం సాధించి రాష్ట్రంలో ఐదోసారి అధికారం చేపట్టేందుకు సిద్ధమైంది. ఇక్కడ కాంగ్రెస్ అధికార బీజేపీ జోరును ఏమాత్రం అడ్డుకోలేకపోయింది. హస్తం పార్టీ కేవలం 66 స్థానాలకు మాత్రమే పరిమితమై, మరోసారి ప్రతిపక్ష స్థానంతో సరిపెట్టుకొన్నది. బుధ్ని స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కాంగ్రెస్ అభ్యర్థిపై లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. రాష్ట్రంలో 14 ఎన్నికల్లో ర్యాలీల్లో బీజేపీ తరపున ప్రధాన మోదీ ప్రచారం నిర్వహించారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ 114 స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీ 109 నియోజకవర్గాల్లో గెలిచింది. మొదట కాంగ్రెస్ నుంచి కమల్నాథ్ ముఖ్యమంత్రి కాగా, తర్వాత జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు కారణంగా ఆ పార్టీ అధికారం కోల్పోవాల్సి వచ్చింది. 2018 డిసెంబర్-2020 మార్చి మధ్య మాత్రమే కమల్నాథ్ సీఎంగా చేశారు. తర్వాత సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ అధికారం చేపట్టింది. రాష్ట్రంలో అంతకుముందు 2003, 2008, 2013 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వరుసగా మూడుసార్లు గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
రాజస్థాన్లో కొనసాగిన ఆనవాయితీ..
రాజస్థాన్ కోటలో బీజేపీ మరోసారి పాగా వేసింది. సీఎం అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసింది. గత కొన్ని దఫాలుగా వరుసగా ఏ పార్టీకి అధికారం ఇవ్వని రాజస్థాన్ ఓటర్లు, ఈ సారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. మొత్తం 200 అసెంబ్లీ నియోజకవర్గాలకుగానూ 199 స్థానాల్లో ఎన్నికలు జరుగ్గా.. 115 స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది. రాజస్థాన్లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు గెలిచి అధికారం చేపట్టిన కాంగ్రెస్.. ఈసారి మాత్రం 70 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. భారత్ అదివాసీ పార్టీ మూడు స్థానాలను గెలుచుకొన్నది. బీఎస్పీ రెండు స్థానాల్లో, ఆర్ఎల్డీ, ఆర్ఎల్పీ ఒక్కొక్క స్థానాలను కైవసం చేసుకున్నాయి.
ఇక స్వతంత్రులు ఏకంగా 8 స్థానాలను గెలుచుకోవడం విశేషం. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు పెద్దగా పనిచేసినట్టు కనిపించలేదు. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ప్రముఖుల్లో సర్దార్పుర నుంచి సీఎం అశోక్ గెహ్లాట్, టోంక్ నుంచి సచిన్ పైలట్, కోటా నార్త్ నుంచి శక్తి ధరివాల్ ఉన్నారు. 17మంది మంత్రులు పరాజయం పాలయ్యారు. స్పీకర్ సీపీ జోషి బీజేపీ అభ్యర్థి విశ్వరాజ్ సింగ్ మేవార్ చేతిలో ఓడిపోయారు. మాజీ సీఎం, బీజేపీ నేత వసుంధరా రాజే జాల్రాపాటన్ స్థానం నుంచి 50 వేలకు పైగా మెజార్టీతో గెలిచారు. రాష్ట్ర ఎన్నికల బరిలో దిగిన ఏడుగురు బీజేపీ ఎంపీలకు గానూ నలుగురు మాత్రమే ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు.
ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్కు పరాభవం
ఛత్తీస్గఢ్లో సీఎం భూపేశ్ బఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్కు ప్రజలు టాటా చెప్పారు. 90 స్థానాలు ఉన్న అసెంబ్లీలో బీజేపీ 54 నియోజకవర్గాల్లో విజయఢంకా మోగించగా, కాంగ్రెస్ 35 స్థానాల్లో గెలిచింది. 2018 ఎన్నికల్లో 68 సీట్లతో హస్తం పార్టీ అధికారం చేపట్టగా.. బీజేపీ కేవలం 15 సీట్లకే పరిమితమైంది. ఈ సారి ఇక్కడ ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీ ఇచ్చిన వాగ్దానాలు ప్రజలను ఆకర్షించినట్టుగా తెలుస్తున్నది. కమలం పార్టీ ‘మోదీ కీ గ్యారెంటీ-2023’ పేరుతో వివాహిత మహిళలకు అర్థిక సాయం వంటి పలు హామీలు ఇచ్చింది. ఇవే ఆ పార్టీని అధికారం దిశగా నడిపాయని విశ్లేషకులు అంటున్నారు.