Congress | కరోనా మరణాల సంఖ్యను ప్రధాని మోదీ తక్కువ చేసి చూపిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. కరోనా విషయంలో పనిచేయడం కంటే ప్రసంగాల వైపే మోదీ ఎక్కువగా మొగ్గుచూపుతారని ఖర్గే ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో మాత్రం మోదీ ప్రతిరోజూ కనిపిస్తారని, కానీ.. పార్లమెంట్కు మాత్రం గైర్హాజరవుతారని తీవ్రంగా మండిపడ్డారు. రాజ్యసభలో ప్రతిష్టంభన ఏర్పడిందని, మోదీ పార్లమెంట్కు హాజరై, దానిని తొలగించాల్సిందిపోయి, పార్లమెంట్ సమావేశాలకు డుమ్మా కొట్టారని విమర్శించారు.
ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా జాతినుద్దేశించి ప్రసంగించిన అంశంపై కూడా ఖర్గే స్పందించారు. థర్డ్ వేవ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సింది ఏమీ లేదని, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారని పేర్కొన్నారు. మోదీ బీజేపీ విషయంలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారని, గతంలో ఇలా ఎవ్వరూ చేయలేదని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని ఖర్గే ఆరోపించారు.