మణిపూర్ ఎన్నికల సందర్భంగా అధికార బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. రాష్ట్రాన్ని ఈ ఐదేళ్లూ బీజేపీ అంధకారంలోకి నెట్టేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మణిపూర్ ఎన్నికల వ్యవహారాల పరిశీలకుడు జైరాం రమేశ్ విమర్శించారు. ఈ ఐదేళ్లూ చీకటే అన్న శీర్షికతో కాంగ్రెస్ ఓ బుక్లెట్ను రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా జైరాం రమేశ్ మాట్లాడుతూ.. ఐదేళ్ల పాటు సుస్థిర ప్రభుత్వాన్ని అందిస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని, అది జరగని పని అంటూ విమర్శించారు.
ఇక.. డ్రగ్స్ను ఉక్కుపాదంతో అణిచేస్తామని బీజేపీ ప్రకటించిందని, అదో పెద్ద జోక్ అంటూ జైరాం ఎద్దేవా చేశారు. అలాగే ఏఎఫ్ఎస్పీఏ చట్టం విషయంలో కూడా బీజేపీ మౌనాన్నే ఆశ్రయిస్తోందంటూ మండిపడ్డారు. మణిపూర్లో బీజేపీ ఇప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేదని, అయినా… ప్రజల ముంగిటకు పాలన తెస్తామని బీజేపీ గొప్పలకు పోతోందంటూ ఆయన చురకలంటించారు. ఇక.. మహిళలకు రిజర్వేషన్లు ఇస్తామంటూ ఓటు బ్యాంకు రాజకీయాలకు తెర లేపుతున్నారని జైరాం రమేశ్ మండిపడ్డారు.