భోపాల్ : కాంగ్రెస్ హిందూ వ్యతిరేక వైఖరిని అవలంభిస్తోందని ఆ పార్టీ నేత, ఆధ్యాత్మికవేత్త ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ మండిపడ్డారు. మధ్యప్రదేశ్లో (Madhya Pradesh Polls) పార్టీ ప్రచారానికి తనను పిలవకపోవడానికి ఇది ఓ కారణం అయిఉంటుందని తాను భావిస్తున్నానని అన్నారు. కాంగ్రెస్ నిర్ణయంతో తాను నిరాశకు లోనుకాలేదని, వారికి హిందువుల మద్దతు అవసరం లేకపోవచ్చని, హిందూ గురువును స్టార్ క్యాంపెయినర్గా నియమించడంలో వారికి ఇబ్బందులు ఉన్నాయేమోనని పేర్కొన్నారు. ఏమైనా ఇది పార్టీ నిర్ణయమని, కాంగ్రెస్లో శ్రీరాముడిని ద్వేషించే నేతలు కొందరున్నారని తాను భావిస్తున్నానని ఆచార్య ప్రమోద్ అన్నారు.
విపక్ష ఇండియా కూటమిపైనా ఆచార్య పలు సందేహాలు లేవనెత్తారు. ప్రధాని మోదీని ఓడించి బీజేపీ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడమే ఇండియా కూటమి లక్ష్యమని, అయితే వారు మోదీని ద్వేషించే క్రమంలో వారు భారత్ను ద్వేషిస్తున్నారనే విషయం మరిచిపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు. ప్రధాని పార్లమెంట్ భవనాన్ని ప్రారంభిస్తే విపక్ష నేతలు విమర్శించారని, వందే భారత్ను పట్టాలెక్కిస్తే విమర్శించారని గుర్తుచేశారు.
ప్రధాని మోదీని విమర్శించడాన్ని ఎవరూ తప్పుపట్టరని, కానీ ఆయనను పనికట్టుకుని ద్వేషించడం సరైంది కాదని అన్నారు. విపక్షం అన్నింటినీ విస్మరించి గందరగోళంగా తయారైందని ఆచార్య ఆక్షేపించారు. రాష్ట్ర అసెంబ్లీలో మహిళలను ఉద్దేశించి బిహార్ సీఎం నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలను విపక్ష కూటమిలో ఎవరూ విమర్శించలేదని అన్నారు.
Read More :
Wipro | విప్రో ఉద్యోగులకు మరో షాక్.. వారికి జీతాల పెంపు ఉండదు..!