బెంగళూర్ : మణిపూర్లో హింస ప్రజ్వరిల్లుతుంటే అక్కడి పరిస్ధితిని చక్కదిద్దాల్సిన ప్రధాని నరేంద్ర మోదీ కర్నాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) ప్రచారంలో తలమునకలవుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. మణిపూర్లో హింసాకాండతో అక్కడ కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేశారని పరిస్ధితి ఇలా ఉంటే ప్రధాని మోదీ బెంగళూర్లో 9 గంటల పాటు రోడ్షో నిర్వహించేందుకు సిద్ధమయ్యారని కాంగ్రెస్ ఆక్షేపించింది.
మోదీ పూర్తిగా ఎన్నికల ప్రచారంపైనే దృష్టి సారించి పాలనా వ్యవహారాలను గాలికొదిలేశారని దుయ్యబట్టింది. మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు సైతం పాలనా వ్యవహారాలను పక్కనపెట్టి ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారని వ్యాఖ్యానించింది. ప్రధాని మోదీ ప్రాధాన్యతలను కాంగ్రెస్ ప్రశ్నించింది. ఆయనకు దేశ పరిస్ధితులు ఎలా ఉన్నా ఎన్నికలు, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని మండిపడింది.
మరోవైపు మణిపూర్లో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొనడంతో భద్రతా ఏర్పాట్లను సమీక్షించేందుకు అమిత్ షా కర్నాటక పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇక కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మూడు రోజులే సమయం ఉండటంతో ప్రధాన పార్టీలు అగ్రనేతలు, సినీ నటులతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. మే 10న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
Read More
Video | ఉక్రెయిన్ ఎంపీ చేతిలోని జెండాను లాక్కున్న రష్యా ప్రతినిధి.. చావబాదిన ఎంపీ