బెంగళూర్ : ప్రత్యర్ధులపై మాటల తూటాలు పేల్చడంతో పాటు నేతల డైలాగ్ వార్తో కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం (Karnataka Assembly Elections) వేడెక్కింది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ప్రచార పర్వంలో చేసిన వ్యాఖ్యలు మంటలు రేపుతున్నాయి. మోదీజీ ఆశీస్సులను కర్నాటక కోల్పోకుండా కమలం గుర్తుకు ఓటు వేసి అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లాంటూ నడ్డా ఓటర్లకు పిలుపు ఇవ్వడం పట్ల కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
బీజేపీ చీఫ్ ప్రసంగ వీడియోను ట్వీట్ చేసిన కాంగ్రెస్ నడ్డా తీరును తప్పుపట్టింది. నడ్డా ఓటర్లను బెదిరిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యంపై పెను దాడి అంటూ కాంగ్రెస్ ఆక్షేపించింది. అవినీతిలో కూరుకుపోయిన బీజేపీ సర్కార్కు ఓటు వేయకుంటే కర్నాటక ప్రజల రాజ్యాంగ హక్కులను లాగేసుకుంటామనే తరహాలో నడ్డా బెదిరింపు ధోరణితో మాట్లాడారని కాంగ్రెస్ ఆరోపించింది. ఇది ప్రజాస్వామ్యంపై దాడి మాత్రమే కాదని, కన్నడిగులను బీజేపీ ఎలా చూస్తోందనేది వెల్లడిస్తోందని కాషాయ పార్టీపై మండిపడింది.
నడ్డా వ్యాఖ్యలను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్, కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే, పార్టీ ప్రతినిధి సుప్రియ శ్రీనటె సహా పలువురు నేతలు ఖండించారు. బీజేపీ కన్నడిగులను అవమానిస్తోందని, కర్నాటక సంక్షేమానికి మోదీ ఆశీస్సులు తమకు అవసరం లేదని ప్రియాంక్ ఖర్గే స్పష్టం చేశారు. మోదీ ప్రధాని కాక ముందు కన్నడిగులు రాతి యుగంలో ఉన్నారని మీరు అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. తమదైన భాష, సంస్కృతి లేవా..? మమాకు ఆహారం, దుస్తులు, నివాసం, విద్యుత్ లేవా..? అసలు మాకు రోడ్లు, స్కూళ్లు, యూనివర్సిటీలు, డ్యామ్లు, ప్రాజెక్టులు లేవా..మేమంతా నిరుద్యోగులమా..అని ప్రియాంక్ ఖర్గే నిలదీశారు.
Read More