Himachal Pradesh | (స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): కిందటేడాది హిమాచల్ప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు.. ఇచ్చిన 10 ప్రధాన హామీలను ఇప్పటికీ అమలు చేయట్లేదు. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, మహిళలకు నెలకు రూ.1,500 జీవన భృతి చెల్లిస్తామని, పాడి రైతుల దగ్గర ఆవుపాలను లీటరుకు రూ.80కి చొప్పున, గేదె పాలు లీటరుకు రూ.100 చొప్పున కొనుగోలు చేస్తామంటూ ఎన్నికల సమయంలో ఊదరగొట్టింది. ఆఖరుకు ఆవుపేడను కూడా కిలో రూ.2 చొప్పున కొనుగోలు చేస్తామని మాటిచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిలో ఏ ఒక్కదాన్ని కూడా ప్రభుత్వం అమలులోకి తీసుకురాలేదు.
ఉచిత విద్యుత్తు ఇలా..
పగ్గాలు చేపట్టిన వెంటనే.. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును సరఫరా చేయడం పక్కకు పెట్టిన కాంగ్రెస్.. విద్యుత్తు చార్జీలు యూనిట్కు 86 పైసలు చొప్పున పెంచింది. అంతేకాకుండా, జలవిద్యుత్తు కేంద్రాల మీద జలవినియోగ పన్ను విధించింది. దీంతో ఈ భారం అంతిమంగా వినియోగదారులపైనే పడింది. ఆగ్రహించిన హక్కుల కార్యకర్తలు ఉచిత విద్యుత్తు హామీని ఎప్పుడు నెరవేరుస్తారని సర్కారును నిలదీస్తే, ‘ఇంకా సమయం ఉందిగా.. మరో మూడేండ్లలో అమలు చేస్తాంలే’ అంటూ సాక్షాత్తూ ముఖ్యమ్రంతి సుఖ్విందర్ సింగ్ ఏకంగా రాష్ట్ర శాసనసభలోనే చెప్పుకొచ్చారు.
మహిళలకు భ్రమగా మారిన భృతి
రాష్ట్రంలో 2.35 లక్షల మంది మహిళలకు భృతిని వర్తింపచేస్తామని ఊరించిన హస్తం పార్టీ.. చివరకు లాహల్ స్పితి అనే ఒకే ఒక్క జిల్లాలో ఓ మారుమూల ప్రాంతానికి మాత్రమే ఈ పథకాన్ని పరిమితం చేసింది. అదీ పైలట్ ప్రాజెక్టుగా కేవలం 9 వేల మంది మహిళలకే స్కీమ్ను కొన్ని నెలలకే వర్తింపజేసింది. టిబెట్ సరిహద్దుల్లో జనసాంద్రత చదరపు కిలోమీటరుకు కేవలం ఇద్దరు మాత్రమే ఉన్న ఈ జిల్లాను ప్రభుత్వం ఎంచుకోవడం ప్రజలను వంచించడమేనని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి.
మిగిలిన హామీల సంగతీ అలాగే..
ఆవులు, గేదెల పాల ధర పెంపు విషయంలోనూ కాంగ్రెస్ మాటతప్పింది. ఆవుపేడ కొనుగోలునూ ప్రకటనలకే పరిమితం చేసింది. పాత పింఛను విధానం పునరుద్ధరణ హామీని తప్పింది. 5 లక్షల ఉద్యోగాల భర్తీని గాలికొదిలేసి రిక్రూట్మెంట్నే నిలిపేసింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణను మరిచింది. డ్రగ్స్పై ఉక్కుపాదం, ఉద్యోగులకు 14 శాతం డీఏ, ఆపిల్ సాగుదారులకే ధరల నిర్ణయాధికారం వంటి హామీలను తుంగలో తొక్కింది. యువతకు 680 కోట్ల స్టార్టప్ ఫండ్ స్కీమ్ ఇంకా ప్రారంభమే కాలేదు. వడ్డీలేని రుణాలుతో పాటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 4 ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు, సంచార వాహనాలతో ప్రతి గ్రామనికి వైద్య సౌకర్యం ఇలా అన్ని హామీలను అటకెక్కించింది.