Monsoon Session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ప్రభుత్వం తరఫున సీనియర్ కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్, రాజ్యసభలో బీజేపీ నేత పీయూష్ గోయల్, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గైర్హాజరయ్యారు. కాంగ్రెస్ తరఫున మల్లికార్జున్ ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి, జైరాం రమేశ్, డీఎంకే నేత టీఆర్ బాలు, తిరుచ్చి శివ, టీఎంసీ నుంచి సుదీప్ బందోపాధ్యాయ, ఎన్సీపీ నుంచి శరద్ పవార్, టీఆర్ఎస్ నుంచి కేశవరావు, నామా నాగేశ్వర్రావు, బీజేడీ నుంచి పినాకి మిశ్రా, వైఎస్సార్సీపీ నుంచి విజయసాయిరెడ్డి, మిధున్రెడ్డి, శివసేన తరఫున సంజయ్ రౌత్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశంలో ద్రవ్యోల్బణం, ‘అన్పార్లమెంటరీ పదాలు’, అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్ను ఉప సంహరించుకోవాలనే డిమాండ్ను ప్రతిపక్షాలు లేవనెత్తాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నెల 18న ప్రారంభమై ఆగస్ట్ 12న ముగియనున్నాయి.
అఖిలపక్ష సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకాకపోవడంపై గైర్హాజరుకావడంపై కాంగ్రెస్ ప్రశ్నలు సంధించింది. ‘త్వరలో జరుగనున్న పార్లమెంట్ సమావేశాలపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశమైతే ప్రధాని ఎప్పటిలాగే గైర్హాజరయ్యారు. ఇది ‘అన్పార్లమెంటరీ’ కాదా? అని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. అఖిలపక్ష సమావేశంలో పలు అంశాలపై చర్చించామని, 13 అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చామని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే తెలిపారు. బిల్లుల గురించి ఏమీ ప్రస్తావించలేదన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ సమావేశానికి 45 రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తే 36 పార్టీలు హాజరయ్యాయని తెలిపారు. ఆయా పార్టీల నేతలు తమ అభిప్రాయాలు, సూచనలు చెప్పారని, కొన్ని అంశాలపై చర్చించాలని డిమాండ్ చేశారన్నారు. పార్లమెంట్లో ఏ అంశంపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.