బెంగళూరు, డిసెంబర్ 12: మరో ఐదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న కర్ణాటకలో ఎన్నికల వేడి రాజుకుంటున్నది. రాజకీయంగా కొన్నేండ్లుగా సైలెంట్గా ఉన్న మైనింగ్ కింగ్గా పేరుపొందిన బీజేపీ మాజీ మంత్రి గాలి జనార్ధన్రెడ్డి ప్రస్తుత అడుగులు అధికార బీజేపీని కలవరపరుస్తున్నాయి. త్వరలో కొత్త పార్టీ ప్రారంభించే యోచనలో గాలి ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ‘కల్యాణ రాజ్య ప్రగతి పక్ష’ పేరుతో పార్టీ ప్రారంభానికి అన్ని సిద్ధం చేసుకొన్నారని, పార్టీ పేరును ఎన్నికల సంఘం వద్ద నమోదు చేయించుకొనేందుకు ఢిల్లీ వెళ్లనున్నారని పేర్కొన్నాయి. ఇటీవలి వరకు కర్ణాటక బీజేపీలో ఓ వెలుగు వెలిగిన గాలి జనార్ధన్రెడ్డి కొత్త పార్టీ పెడితే తమ పుట్టి మునగడం ఖాయమని, దాదాపు 20 నియోజకవర్గాల్లో బీజేపీ గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశం ఉన్నదని కమలం నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైకమాండ్ జోక్యం చేసుకోవాలని, గాలితో మాట్లాడి శాంతింపజేయాలని రాష్ట్ర బీజేపీ నేతలు వర్తమానాలు పంపినట్టు సమాచారం. ఒకప్పుడు బళ్లారి రాజకీయాలను శాసించిన గాలి జనార్ధన్రెడ్డి తన స్థానాన్ని కొప్పల్ జిల్లాలోని గంగావతికి మార్చుకొని రాజకీయ పునరాగమనానికి ఏర్పాట్లు చేసుకొంటున్నారు.