Gujarat | అహ్మదాబాద్, ఏప్రిల్ 21: దశాబ్దాల కాలంగా బీజేపీ పాలనలో ఉన్న గుజరాత్ పరీక్ష పేపర్ల లీకేజీలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. ముఖ్యంగా ఉద్యోగ నియామకాలకు సంబంధించి నిర్వహించిన పోటీ పరీక్షలలో జరుగుతున్న అనేక అక్రమాలపై ప్రజలు, ఉద్యోగార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో జరిగిన సంఘటనలను పరిశీలిస్తే ప్రజల ఆగ్రహం, ఆవేదన సబబేనని అనిపిస్తున్నది. ఈ నెల 16న భావ్నగర్ పోలీసులు రాష్ట్రస్థాయి లీకేజీ ముఠా గుట్టును రట్టు చేశారు. ప్రభుత్వం నిర్వహించే పరీక్షలకు కొందరు నకిలీ వ్యక్తులతో పరీక్ష రాయిస్తున్న రాకెట్ను వీరు ఛేదించారు. ఈ సందర్భంగా ఆరుగురిని అరెస్ట్ చేయగా, వారిలో ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులే కావడం గమనార్హం. 2012 నుంచి వేల మందితో వీరు ఉద్యోగ నియామక పరీక్షలు రాయించారు.
దశాబ్ద కాలంగా చూసుకుంటే ఇంచుమించు డజన్కు పైగా పేపర్ లీకులు, అవినీతి, అక్రమాలు, రిగ్గింగ్ చోటుచేసుకున్నాయి. 2015 నుంచి గుజరాత్ సర్కారు నిర్వహించిన ఉద్యోగ పరీక్షలలో ఒక్క దాంట్లో కూడా లీకేజీలు, అక్రమాలు, వివాదలు చోటుచేసుకోకుండా జరగలేదంటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ ఏడాది జనవరిలో జూనియర్ క్లర్క్ల నియామకానికి జరిగిన పరీక్ష పేపర్ లీకైంది. దీంతో నిరుద్యోగులు భగ్గుమన్నారు. రోడ్డెక్కి తీవ్ర ఆందోళన చేశారు. బీజేపీ ప్రభుత్వం గద్దె దిగాలంటూ నినదించారు. దీంతో దేశవ్యాప్తంగా పరువు పోతున్నదని గ్రహించి గుజరాత్ పబ్లిక్ ఎగ్జామినేషన్ అక్రమాల నిరోధక చట్టం-2023 పేరుతో చట్టాన్ని తెచ్చింది.
గత దశాబ్ద కాలంగా పలు రిక్రూట్మెంట్ ఎగ్జామ్లను గుజరాత్ ప్రభుత్వం రద్దు చేసింది. ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లు, జిల్లా పంచాయతీ, స్టేట్ అడ్మినిస్ట్రేషన్లో క్లర్కులు, మున్సిపాల్టీలో చీఫ్ ఆఫీసర్, ఫారెస్ట్ గార్డు, ఆరోగ్య శాఖలో నర్సుల ఉద్యోగ నియామకాలకు సంబంధించి జరిగిన పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది.
ఉద్యోగ నియామక పరీక్షల్లో దశాబ్దాల కాలంగా అక్రమాలు చోటు చేసుకోవడానికి గల కారణాలను పరిశీలిస్తే అధికారంలోని బీజేపీ నేతలు, దాని అనుబంధ సంస్థ అయిన ఆరెస్సెస్ వాళ్లే కారకులుగా తెలుస్తున్నది. ఉద్యోగ నియామక పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వివిధ సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఈ నియామక సంస్థలకు చైర్మన్లుగా బీజేపీకి చెందిన వారో, ఆరెస్సెస్ నేతలో ఉంటున్నారు. దీంతో అవి అవినీతితో నిండిపోతున్నాయి. తమ వారి కోసం పేపర్లు లీక్ చేయడం, బయట అమ్ముకోవడం, రాతపరీక్షలో మాల్ప్రాక్టీస్, వాల్యుయేషన్లో అక్రమాలకు పాల్పడటం ఈ నేతలకు పరిపాటిగా మారింది.