కర్కాట్, మే 26: కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుశ్వాహా కీలక వ్యాఖ్యలు చేశారు. ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకానికి ప్రస్తుతం అనుసరిస్తున్న కొలీజియం వ్యవస్థ అప్రజాస్వామికమని వ్యాఖ్యానించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తే, కొలీజియం వ్యవస్థ రద్దుకు తిరిగి ప్రయత్నిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తాను పోటీ చేస్తున్న కర్కాట్ లోక్సభ పరిధిలో ఆదివారం జరిగిన ఎన్నికల సభలో ఈ రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్ఎల్ఎం) నేత మాట్లాడుతూ ‘కొలీజియం వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయి. అది అప్రజాస్వామికంగా ఉంది.
ఈ సిస్టమ్ అత్యున్నత న్యాయ వ్యవస్థలో దళితులు, ఓబీసీలే కాక అగ్రవర్ణాలలోని పేదలను జడ్జీల నియామకానికి సంబంధించిన మార్గాలను మూసివేసింది’ అని ఆరోపించారు. ప్రస్తుతం సుప్రీం కోర్టు, హైకోర్టులలో బెంచ్ల కూర్పు చూస్తే అవి కొన్ని కుటుంబాలకు చెందిన సభ్యుల ఆధిక్యతతో నిండి ఉన్న విషయం తెలుస్తుందన్నారు. కాగా, కుశ్వాహా వ్యాఖ్యలను ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ తప్పుబట్టారు. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కొలీజియం వ్యవస్థపై ఎన్నడూ ఎందుకు ఇలాంటి విమర్శలు చేయలేదని ప్రశ్నించారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే వచ్చే ఐదేండ్లలో దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ)ని అమలు చేస్తామని కేంద్ర మంత్రి అమిత్షా పేర్కొన్నారు. అదేవిధంగా ‘ఒక దేశం-ఒక ఎన్నికను(జమిలి ఎన్నికలు)’ కూడా మోదీ ప్రభుత్వం అమలు చేస్తుందని పీటీఐ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దేశంలో ఏకకాల ఎన్నికలు నిర్వహించాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. జమిలి ఎన్నికలకు మనం సిద్ధమైతే, ఎన్నికలను ప్రస్తుతం నిర్వహిస్తున్న వేసవి కాలంలో కాకుండా శీతాకాలం లేదా మరో సమయానికి మార్చే సాధ్యాసాధ్యాలపై ఆలోచిస్తామని పేర్కొన్నారు.