పెద్దేముల్, ఏప్రిల్ 9 : జీవన ఎరువులు వినియోగించి వేరు శనగ పంటలో అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని మన్సాన్పల్లిలో వ్యవసాయ శాఖ-ఆత్మ టీమ్ ఆధ్వర్యంలో సంయుక్తంగా క్షేత్ర దినోత్సవంలో భాగంగా వేరు శనగ పంటపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ వేరు శనగ పంటలో అధిక మొత్తంలో దిగుబడులు సాధించాలంటే రైతులు జీవన ఎరువులను ఉపయోగించాలన్నారు. పంటలో ఊడలు దిగే సమయంలో జిప్సమ్ ఎకరాకు 150 నుంచి 200 కిలోలు వాడితే గింజ లావుగా వచ్చి అధిక దిగుబడితో పాటు నూనె శాతం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో తాండూరు ఏడీఏ శంకర్ రాథోడ్, మండల ఏవో నజీరోద్దీన్, మన్సాన్పల్లి, మదనంతాపూర్, మారేపల్లి తండాల సర్పంచులు రుక్కిబాయి, గోవర్ధన్, పాండు, ఆత్మ సిబ్బంది పాల్గొన్నారు.
ఫర్టిలైజర్ డీలర్లు అక్రమాలకు పాల్పడితే కేసు
ఫర్టిలైజర్ డీలర్లు అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదవుతాయని జిల్లా వ్యవసాయ శాఖ (డీఏవో) గోపాల్ హెచ్చరించారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాలకు చెందిన ఫర్టిలైజర్ డీలర్లతోపాటు వ్యవసాయాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వానకాలం సీజన్లో డీలర్లు రైతులకు ప్రభుత్వం అందించే ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతీ డీలర్ స్టాక్ రిజిస్టర్ విధిగా ఏర్పాటు చేసి, ఎప్పటి కప్పుడు స్టాక్ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ పాస్ యంత్రాల ద్వార రైతులకు విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయాలన్నారు.
లక్ష టన్నుల వరిధాన్యం కొనుగోలు లక్ష్యం
ఈ నెలాఖరు నుంచి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేశామని డీఏవో గోపాల్ అన్నారు. జిల్లాలో 190 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్, ఎఎంసీల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. క్వింటాల్కు గిట్టుబాటు ధర రూ.1,888లుగా నిర్ణయించినట్లు తెలిపారు. సమావేశంలో తాండూరు ఏడీఏ శంకర్రాథోడ్, ఏవోలు ఉన్నారు.
ఇవీ కూడా చదవండి…
కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి