సైదాపూర్, ఏప్రిల్ 9: ప్రధాన రహదారుల వెంట వెళ్తుంటే రోడ్ల పక్కన నీటిని తరలించడం కోసం సిద్ధంచేసిన భారీ సిమెంటు పైపులు కనిపిస్తుంటాయి. సుదూర ప్రాంతాల నుంచి పట్టణాలు, నగరాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఈ పైపులను ఉపయోగిస్తుంది. రూ.3.5 లక్షల నుంచి రూ.5.5 లక్షల వరకు వెచ్చించగలిగితే ఇటువంటి పైపులతో ఒకరు లేదా ఇద్దరు నివసించడానికి యోగ్యమైన ఆవాసాలుగా తీర్చిదిద్దవచ్చని అంటున్నారు కరీంనగర్ జిల్లా, సైదాపూర్ మండలం, బొమ్మకల్కు చెందిన యువ ఇంజినీర్ పేరాల మానసారెడ్డి.
ఓపాడ్ లేదా సూక్ష్మగృహాలుగా పేర్కొంటున్న ఈ నివాసాల్లో ఓ బెడ్రూం, కిచెన్, హాల్తోపాటు బాత్రూం, అటకలు కూడా ఉండటం విశేషం. 2000 మిల్లీమీటర్ల వ్యాసార్థంతో ఉండే పైపుల్లో 120 చదరపు అడుగుల బిల్ట్అప్ ఏరియాతో సింగిల్ బెడ్రూం ఓపాడ్లను ఆమె ఇటీవల ఆవిష్కరించారు. హైదరాబాద్లోని చెంగిచెర్లలో ఆమె ఓపాడ్ను రూపొందించారు.
అన్నిరకాల వాతావరణ పరిస్థితులను తట్టుకోగలిగే ఈ గృహాలు నూరేళ్లు మన్నుతాయని, వీటిని ఎక్కడికైనా సులభంగా తరలించవచ్చని మానసారెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టుకు తన ఒంటరి తల్లే స్ఫూర్తి అని, తనకు విద్యనందించిన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) సహకారంతో ఈ కలను నెరవేర్చగలిగానని పేర్కొన్నారు.
లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో గత ఏడాది బీటెక్ (సివిల్ ఇంజినీరింగ్) పూర్తిచేసిన మా నస.. ఆరునెలలపాటు జపాన్, హాంకాంగ్లోని పలు గృహాల నమూనాలు, స్థానికుల అవసరాలపై అధ్యయనం చేసినట్టు వివరించారు. సమాజంలోని అత్యం త బలహీనవర్గాల కోసం ఓపాడ్ల డిజైన్ను రూపొందించినట్టు చెప్పారు. ఇప్పుడు తనవద్ద వివిధ వర్గాల అభిరుచులకు తగిన విధంగా 12 వేర్వేరు ఓపాడ్ల డిజైన్లు ఉన్నాయని తెలిపారు. రిసార్ట్లు, రెస్టారెంట్లు, సంచార గృహాలు, సంచార దవాఖానలు, గెస్ట్హౌస్లు, గార్డ్రూమ్లకు సంబంధించిన డిజైన్లను రూపొందించినట్టు చెప్పారు.
దేశంలోనే మెదటిది
వాటర్పైపులతో ఓపాడ్ నిర్మాణం మన దేశంలోనే మెదటిది. ఆరునెలలపాటు రీసెర్చ్ చేసి వివిధ రకాల డిజైన్లతో ఇంటిని నిర్మించా. కేవలం రూ.3.5 లక్షలతో ప్రారంభమయ్యే ఓపాడ్ గరిష్ఠంగా రూ.8 లక్షల వరకు ఉంటుంది. ఒకసారి నిర్మించిన తర్వాత మళ్లీ దానిని ఎక్కడికైనా తరలించవచ్చు. ఓపాడ్లోనే ఫర్నీచర్ కూడా అందిస్తున్నాం. టూరిజంవారికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది
–పేరాల మానసారెడ్డి