Karnataka | బెంగళూరు, జూలై 12: ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఓటర్లను ఆకర్షించేందుకు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఐదు గ్యారెంటీలు ఇప్పుడు ప్రభుత్వానికి గుదిబండగా మారుతున్నాయి. గ్యారెంటీలు అమలు చేసేందుకే సర్కారు ఖజానా ఖాళీ అవుతుండటంతో అభివృద్ధి పనులు అటకెక్కాయి. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలే బాహాటంగా అంగీకరిస్తున్నారు. తాజాగా కొప్పల్ జిల్లాలోని యెల్బర్గ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఆర్థిక సలహాదారుడు బసవరాజ్ రాయరెడ్డి తన నియోజకవర్గలో ఒక చెరువు పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి నన్ను ఆర్థిక సలహాదారుగా నియమించుకున్నారు. నేను ఆయనతో రోజూ మాట్లాడతా. ఈ పనికి(చెరువు) డబ్బులు వచ్చాయి. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పని ఇదొక్కటే. నిధులన్నీ గ్యారెంటీలే ఖాళీ చేసేస్తున్నాయి. రూ.60-65 వేల కోట్లు గ్యారెంటీలకు ఖర్చవుతున్నాయి. ఇది ఎంత కష్టమో నాకు తెలుసు’ అంటూ వ్యాఖ్యానించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిపోయింది. అప్పటి నుంచి అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్ నేతలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల పలువురు కాంగ్రెస్ నేతలు కూడా ఇవే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల బాగల్కోట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జేటీ పాటిల్ కూడా గ్యారెంటీలపై మరోసారి పునరాలోచన చేయాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కోరారు. మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆ పార్టీ సీనియర్ నేత లక్ష్మణ్ కూడా గ్యారెంటీలకు వ్యతిరేకంగా మాట్లాడారు. కాగా, రాయరెడ్డి తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశం కావడంతో ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ స్పందించారు. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని, తాము అన్నింటినీ ఓ దారికి తీసుకొస్తున్నామని, గ్యారెంటీలను కొనసాగిస్తామని వివరణ ఇచ్చుకున్నారు.
ఖజానా మొత్తం గ్యారెంటీలకే ఖర్చు అవుతున్న నేపథ్యంలో ఆదాయ సమీకరణకు కాంగ్రెస్ సర్కారు ప్రజలపై పన్నుల మోత మోగిస్తున్నది. గైడెన్స్ వ్యాల్యూ ట్యాక్స్, అదనపు ఎక్సైజ్ డ్యూటీ, రవాణా వాహనాలపై అదనపు సెస్, ఈవీలపై లైఫ్ టైమ్ ట్యాక్స్, పెట్రోల్, డీజిల్పై సేల్స్ ట్యాక్స్ను పెంచేసింది. బస్సు చార్జీలు కూడా పెంచే యోచనలో ఉన్నది.