బెంగళూరు, మార్చి 18: కర్ణాటక రాజధాని బెంగళూరులో నీటి సంక్షోభం నెలకొన్నదని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సోమవారం అధికారులతో సమీక్షించిన ఆయన.. సమస్య పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. బెంగళూరులో రోజుకు 2,600 ఎంఎల్డీ(మిలియన్ లీటర్స్ పర్ డే) నీటి అవసరం ఉండగా.. దాదాపు 500 ఎంఎల్డీ కొరత ఉందని తెలిపారు.
నగరంలో ఉన్న మొత్తం 14 వేల బోరుబావుల్లో 6,900 మేర ఎండిపోయాయని పేర్కొన్నారు. జూన్లో ప్రారంభం కానున్న ‘కావేరీ ఫైవ్ ప్రాజెక్టు’ ద్వారా చాలా వరకు నీటి ఇబ్బందులు తీరుతాయని అన్నారు. బెంగళూరులో అసలు నీటి సంక్షోభమే లేదని డిప్యూటీ సీఎం శివకుమార్ ఇటీవల పేర్కొనడంపై విపక్షాలు విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే.