Karnataka : బెంగళూర్కు సమీపంలోని ఏరోస్పేస్ పార్క్లో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కుటుంబానికి చెందిన ట్రస్ట్కు ప్లాట్ కేటాయించడంపై కర్నాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. అధికారులు నిబంధనల మేరకే సదరు ట్రస్ట్కు భూమి కేటాయించారని, అర్హతలు, విధి, విధానాలను అనుసరించారని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కాషాయ పాలకులు చాణక్య యూనివర్సిటీకి భూములు కేటాయించారని ఆరోపించారు.
కాగా, బెంగళూర్కు సమీపంలోని ఓ ఏరోస్పేస్ పార్క్లో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కుటుంబానికి చెందిన ఓ ట్రస్ట్కు 5 ఎకరాల భూ కేటాయింపునకు ఆమోదం లభించడం పెను దుమారం రేపుతోంది. ఖర్గే కుమారుడు రాహుల్ ఈ ట్రస్ట్కు చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఖర్గే కుటుంబానికి చెందిన ట్రస్ట్కు కర్నాటక పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి బోర్డు (KIADB) స్ధల కేటాయింపు అధికార దుర్వినియోగమని, కర్నాటక సర్కార్ బంధుప్రీతికి సంకేతమని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వీయ ట్వీట్ చేశారు.
ఈ ఉదంతంపై ఖర్గే సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. ఐదు ఎకరాల భూమిని ఎస్సీ కోటా కింద సిద్ధార్ధ విహార్ ట్రస్ట్కు కట్టబెట్టారని, ఈ ట్రస్ట్ కాంగ్రెస్ చీఫ్ ఖర్గే అల్లుడు, కలబురగి ఎంపీ రాధాకృష్ణ, కుమారుడు రాహుల్ ఖర్గే ఇతర కుటుంబసభ్యులు నిర్వహిస్తున్నారని మాల్వీయ పేర్కొన్నారు. హైటెక్ డిఫెన్స్ ఏరోస్పేస్ పార్క్ కోసం కేఐఏడీబీ పక్కనపెట్టిన 45.94 ఎకరాల స్ధలంలో ఈ 5 ఎకరాలు భాగమని వివరించారు. స్ధలాల కేటాయింపులో అక్రమాలు జరిగాయని సామాజిక కార్యకర్త దినేష్ కలహళ్లి కర్నాటక గవర్నర్ తావర్ చంద్ గహ్లాట్కు ఫిర్యాదు చేశారు.
Read More :
Kubera | నోట్ల కట్టల మధ్య జిమ్ సర్బ్.. క్యూరియాసిటీ పెంచుతోన్న ధనుష్ కుబేర లుక్