భువనేశ్వర్, మే 29: లోక్సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న ఒడిశాలో సీఎం నవీన్ పట్నాయక్ ఆరోగ్యం రాజకీయ అంశంగా మారింది. నవీన్ పట్నాయక్ ఆరోగ్యంపై బీజేపీ రోజుకో వీడియో విడుదల చేస్తూ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకుంటున్నది. పట్నాయక్ అనారోగ్యంతో ఉన్నారని, ఆయన ప్రభుత్వాన్ని నడపలేరనే భావనను ప్రజల్లో కల్పించేందుకు ప్రయత్నిస్తున్నది. పట్నాయక్కు ఆంతరంగీకుడిగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి, ప్రస్తుత బిజూ జనతాదళ్ ముఖ్యనేత వీకే పాండియన్ను బీజేపీ లక్ష్యంగా చేసుకుంటున్నది. పట్నాయక్ అనారోగ్యాన్ని ఆసరాగా చేసుకొని పాండియన్.. పాలనను తన ఆధీనంలోకి తీసుకున్నారని, పట్నాయక్ను కంట్రోల్ చేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తున్నది. మరోవైపు తాను ఆరోగ్యంగా ఉన్నానని నవీన్ పట్నాయక్ చెప్తున్నారు. దీంతో ప్రజల్లో పట్నాయక్ ఆరోగ్యంపై గందరగోళం నెలకొన్నది.
నవీన్ పట్నాయక్ ఓ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్న వీడియోను బీజేపీ మంగళవారం వైరల్ చేసింది. ఇందులో పట్నాయక్ మాట్లాడుతుండగా పాండియన్ మైక్ పట్టుకున్నారు. వణుకుతున్న పట్నాయక్ చేతిని పాండియన్ దాచేస్తున్నట్టుగా ఈ వీడియో ఉంది. బుధవారం మరో వీడియోను బీజేపీ నేత, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ షేర్ చేశారు. ఓ ఎన్నికల సభలో నవీన్ పట్నాయక్ కాలిని తన కాలితో పాండియన్ జరుపుతున్నట్టుగా ఈ వీడియోలో అస్పష్టంగా కనిపిస్తున్నది. దీంతో ఈ రెండు వీడియోలు వైరల్గా మారాయి.
ఒడిశాలో ఈసారి అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న బీజేపీ.. నవీన్ పట్నాయక్ ఆరోగ్యాన్ని ప్రచారాస్త్రంగా వాడుకుంటున్నది. ఆయన ఆరోసారి అధికారంలోకి వచ్చినా ప్రభుత్వాన్ని నడిపించలేరని, తమిళనాడుకు చెందిన పాండియన్.. అనధికారికంగా ప్రభుత్వాన్ని నడిపిస్తారనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నది. పాండియన్ తమిళుడు కావడంతో, ఒడిశా గొప్పదనాన్ని కాపాడుకుందాం అంటూ పదేపదే బీజేపీ.. ప్రజలకు పిలుపునిస్తున్నది. ఒడిశా పాలన వేరే రాష్ర్టానికి చెందిన వ్యక్తి చేతుల్లోకి వెళ్లొద్దనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్తున్నది.
ఒడిశాలో బీజేపీ అధికారంలోకి వస్తే పట్నాయక్ ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించడంపై ప్రత్యేక కమిటీ వేసి దర్యాప్తు జరిపిస్తామని ప్రధాని మోదీ ఓ సభలో ప్రకటించారు. ఆయన ఆరోగ్యం రోజురోజుకూ దిగజారడంలో కుట్ర దాగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై పట్నాయక్ స్పందిస్తూ.. లేనిపోని అంశాలను ప్రస్తావించడం బీజేపీకి అలవాటేనని విమర్శించారు. తన ఆరోగ్యంపై బీజేపీ పుకార్లు సృష్టిస్తున్నదని, తాను ఆరోగ్యంగా ఉన్నానని, ప్రచారం కూడా చేస్తున్నానన్నారు.