కోల్కతా: దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీసీ) డ్యాముల నుంచి ఇష్టమున్నట్టు నీటిని దిగువకు విడుదల చేశారని, ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్రం ఆడుతున్న నాటకంలో ఇదొక కుట్రగా ఆమె పేర్కొన్నారు. దీనిపై తాము ఉద్యమిస్తామని హెచ్చరించారు.
గురువారం పూర్వ మిడ్నాపూర్, హౌరా జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్ని ఆమె సందర్శించారు. పశ్చిమ బెంగాల్లో వరదలకు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీసీ) కారణమని ఆరోపించారు. ‘ఇది వర్షం నీరు కాదు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని డీవీసీ డ్యాముల నుంచి విడుదలైన నీరు ఇది. డ్యాముల్లో నీటి నిల్వ సామర్థ్యం 36 శాతం తగ్గింది. ఇందుకు కారణం కేంద్రం నిర్లక్ష్యమే. ఇదొక పెద్ద కుట్ర. దీన్ని అడ్డుకుంటాం’ అని మమతా అన్నారు.