పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చెన్నీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. అరవింద్ కేజ్రీవాల్ ఓ అబద్ధాల కోరు అని, పంజాబ్ను దోచుకోవడానికి ఆంగ్లేయుల లాగా వచ్చారంటూ సీఎ చెన్నీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ వ్యాఖ్యలపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ స్పందించారు. పంజాబ్ సీఎం చెన్నీ రెండు స్థానాల్లోనూ ఓడిపోతున్నారని, టెలీపోల్స్లోనూ ఇదే వెల్లడైందని ఎద్దేవా చేశారు. సీఎం చెన్నీ పోటీ చేసే స్థానాల్లో ఆప్ తరపున ఓ సర్వే నిర్వహించామని, మూడు సార్లు ఈ సర్వే చేస్తే, మూడు సార్లూ చెన్నీ ఓడిపోతున్నారనే రిపోర్టులు వచ్చాయని కేజ్రీవాల్ వెల్లడించారు.సీఎం చెన్నీ పోటీ చేసే నియోజకవర్గాల్లో తమకు 52 శాతం ఓట్లు వస్తాయని తమ సర్వేలో తేలిందన్నారు. సీఎం చెన్నీ ఎమ్మెల్యేగానే గెలవనప్పుడు ఇక సీఎం ఎక్కడి నుంచి అవుతారని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు.
కేజ్రీవాల్ అబద్ధాల కోరు : సీఎం చెన్నీ
అరవింద్ కేజ్రీవాల్ ఓ అబద్ధాల కోరు అని, తనపై లేనిపోని అబద్ధాలను ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారని సీఎం చెన్నీ తీవ్రంగా మండిపడ్డారు. అయినా ఏ ఒక్కటీ నిలబడలేదని అన్నారు. అరవింద్ కేజ్రీవాల్తో సహా, పలువురు పంజాబ్ను దోచుకోవడానికే వస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
‘అరవింద్ కేజ్రీవాల్ ఓ అబద్ధాల కోరు. నాపై లేనిపోని అసత్యాలను ప్రచారం చేశారు. లేనిపోని అభాండాలు వేయాలని చూశారు. అవన్నీ తప్పని తేలాయి. గవర్నర్కు నాపై ఫిర్యాదు చేశారు. దీంతో గవర్నర్ దర్యాప్తుకు ఆదేశించారు. నిజాలేమిటో బయటికొచ్చాయి. కేజ్రీవాల్తో సహా ఇతరులందరూ పంజాబ్ను దోచుకోవడానికే వస్తున్నారు.’అంటూ ఆరోపించారు. భారత్ను దోచుకోవడానికి ఎలాగైతే ఆంగ్లేయులు వచ్చారో, అలాగే కేజ్రీవాల్తో సహా అవుట్ సైడర్స్ అందరూ పంజాబ్ను దోచుకోవడానికే వచ్చారంటూ తీవ్ర విమర్శలు చేశారు. కానీ వారి స్థానమేమిటో పంజాబ్ ప్రజలు చూపిస్తారని సీఎం చెన్నీ అన్నారు