బెంగళూరు, మార్చి 4: కర్ణాటకలోని బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్లో అవినీతి డబుల్ అయ్యిందని, అందుకే ఇంజిన్ మార్చాల్సిన సమయమొచ్చిందని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. తొలిసారి కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేజ్రీవాల్ దావణగెరెలో మాట్లాడుతూ బీజేపీ పాలనపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 40శాతం కమీషన్ సర్కార్ అధికారంలో ఉన్నదన్నారు.
ఆప్కు ఒకసారి అవకాశమిస్తే ఢిల్లీ తరహాలోనే కర్ణాటక ప్రజలకు కూడా ఉచిత విద్యుత్తు, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మెరుగైన ఆరోగ్య వసతులు కల్పిస్తామని తెలిపారు. చన్నగిరి బీజేపీ ఎమ్మెల్యే మదల్ విరూపాక్షప్ప కొడుకు ప్రశాంత్ కుమార్ నుంచి రూ. 8 కోట్లకు పైగా అక్రమ నగదును లోకాయుక్త అధికారులు సీజ్ చేసిన విషయాన్ని కేజ్రీవాల్ ప్రస్తావించారు. అవినీతికి పాల్పడి రెడ్హ్యాండెడ్గా దొరికిన బీజేపీ నేతపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్తూ ఒక్క ఆధారం కూడా దొరకని మనీశ్ సిసోడియాను మాత్రం అరెస్ట్ చేసిందని కేంద్రాన్ని విమర్శించారు.
ఇటీవలే కర్ణాటకకు వచ్చి అవినీతి రహిత పాలనను అందిస్తాం.. బీజేపీని గెలిపించండి అని చెప్పిన అమిత్షాపై సెటైర్లు వేశారు. 2018లో కర్ణాటకలో 20 శాతం కమీషన్ ప్రభుత్వం ఉండేదని, అప్పట్లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ తమకు అవకాశం కల్పిస్తే అవినీతిని అంతం చేస్తామని చెప్పి.. తీరా అధికారమిచ్చాక అవినీతిని నిర్మూలించడం కాదు కదా.. ఏకంగా కమీషన్ను 40 శాతానికి పెంచారని విమర్శించారు. డబుల్ ఇంజిన్ సర్కార్లో అవినీతి కూడా డబుల్ అయ్యిందని ఎద్దేవా చేశారు. కర్ణాటక రాష్ట్ర మంత్రులు 40 శాతం కమీషన్ అడుగుతున్నారని కర్ణాటక కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కెంపన్న ప్రధాని మోదీకి లేఖ రాసిన విషయాన్ని కేజ్రీవాల్ గుర్తు చేశారు. అందుకే ఆప్కు ఒకసారి అధికారం ఇవ్వాలని కోరారు.