AAP | న్యూఢిల్లీ, మే 11: ప్రజాస్వామబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికే కార్యనిర్వాహక అధికారాలుంటాయని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వాలు కూల్చే బీజేపీకి చెంప పెట్టని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు తీర్పుతో రెట్టించిన ఉత్సాహంతో ప్రజల కోసం పని చేస్తామని తెలిపింది. ఇన్నాళ్లు ఢిల్లీ అభివృద్ధికి ఆటంకాలు సృష్టించిన అధికారులపై అన్నట్టుగానే ఆప్ సర్కారు వేటు వేయడం మొదలు పెట్టింది. ఇక నుంచి 10 రెట్లు వేగంగా అభివృద్ధి పనులు చేపడతామని వెల్లడించింది. దేశ రాజధాని ప్రాదేశిక ప్రాంతమైన ఢిల్లీకి సంబంధించిన శాసన వ్యవహారాల్లో మంత్రి మండలి తీసుకొనే నిర్ణయాలకు లెఫ్ట్నెంట్ గవర్నర్(ఎల్జీ) బద్ధుడై ఉండాలని సుప్రీం కోర్టు గురువారం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆప్ ఈ వ్యాఖ్యలు చేసింది. సుప్రీం కోర్టు ఢిల్లీ ప్రజలకు న్యాయం చేసిందని, ఇది ప్రజాస్వామ్య విజయమని ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవావాల్ తీర్పుపై స్పందించారు. ‘సత్యమే జయిస్తుంది. ఢిల్లీ గెలుస్తుంది.’ అని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా వ్యాఖ్యానించారు.
మంత్రి మండలి సలహా మేరకు ఎల్జీ విధులు నిర్వర్తించాలని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొనడంతో బీజేపీ ఆటలకు, ఆగడాలకు కళ్లెం పడ్డట్టయ్యింది. ‘పరిపాలన అధికారాల పరిధి’ని మొత్తం పరిపాలనకు అన్వయించుకోకూడదని సుప్రీంకోర్టు ఎల్జీకి స్పష్టం చేసింది. అలా చేస్తే రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామయుతంగా ఎన్నికైన ప్రభుత్వానికి అధికారాలు ఇచ్చిన ఉద్దేశం దెబ్బ తింటుందని చెప్పింది. రెండు సందర్భాల్లో మాత్రమే ఎల్జీ తన విచక్షణాధికారాలు ఉపయోగించవచ్చని తెలిపింది. ఒకటి.. అసెంబ్లీ అధికారాల పరిధికి మించిన అంశాలు, అలాంటి అంశాలకు సంబంధించి రాష్ట్రపతి ఆయనకు కేటాయించిన అధికారాలు, విధుల సందర్భంలో వాడొచ్చని తెలిపింది. రెండు.. చట్టం విచక్షణాధికారాలు ఉపయోగించమని కోరినప్పుడు లేదా ఎల్జీ తన న్యాయ లేదా పాక్షిక న్యాయ విధులను నిర్వహించాల్సి వచ్చినప్పుడు ఉపయోగించవచ్చని వివరించింది.
ఐఏఎస్, ఐపీఎస్ తదితర సివిల్ సర్వీసెస్ అధికారుల విధులపై సుప్రీంకోర్టు గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. వారు రాజకీయంగా తటస్థంగా ఉండాలని, ఎన్నికైన ప్రభుత్వం రోజువారీ నిర్ణయాలను అమలు చేయడంలో మంత్రుల ‘పరిపాలన’ నియంత్రణలో వారు పని చేయాలని మార్గనిర్దేశం చేసింది. ఢిల్లీలో ఎల్జీకి కాకుండా ఢిల్లీ ప్రభుత్వానికి శాసన, కార్య నిర్వాహక అధికారాలుంటాయని తీర్పు ఇచ్చిన సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘సివిల్ సర్వెంట్లు, ఎన్నికైన మంత్రుల జవాబుదారీతనం ప్రభుత్వ పనితీరుని ప్రతిఫలిస్తుంది. ఇంగ్లండ్ తరహా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో సివిల్ సర్వెంట్లు కీలకమైన కార్య నిర్వాహక బాధ్యతలు నిర్వహిస్తారు’ అని కోర్టు తెలిపింది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ ఎల్జీగా వీకే సక్సేనాను నియమించినప్పటి నుంచి ఎల్జీకి, ఆప్ ప్రభుత్వానికి అధికారాల పరిధి మధ్య అనేక వివాదాలు, వాదోపవాదాలు జరిగాయి. ఆప్ ప్రభుత్వం తీసుకున్న అనేక ప్రజా ప్రయోజన పథకాలకు, కార్యక్రమాలకు ఎల్జీ అనుచిత కారణాలతో అడ్డు పుల్ల వేశారు. కేజ్రీవాల్ సర్కారును ముప్పు తిప్పలు పెట్టారు. ప్రభుత్వ టీచర్లకు ఫిన్లాండ్లో శిక్షణ, ఉచిత యోగా తరగతులు తదితర అంశాల్లో ఎల్జీ ప్రవర్తించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే సుప్రీం కోర్టు తాజా తీర్పు నేపథ్యంలో ఢిల్లీ పరిపాలనలో ఎల్జీ పాత్ర నామామాత్రం కానుంది. ఈ నేపథ్యంలో ఆప్ ఎమ్మెల్యేలలో నూతనోత్సాహం నెలకొంది.
సివిల్ సర్వీసెస్ అధికారులు రాజకీయ తటస్థత పాటించాలని, ఎన్నికైన ప్రభుత్వానికే కార్య నిర్వాహక అధికారాలు ఉంటాయని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చిన కొద్ది గంటలకే ఆప్ ప్రభుత్వం దాన్ని ఆచరణలో పెట్టింది. సర్వీస్ విభాగం కార్యదర్శి ఆశిష్ను ఆ పోస్టు నుంచి తొలగించింది. త్వరలోనే పరిపాలన విభాగంలో భారీగా మార్పులు, చేర్పులు ఉంటాయని సీఎం కేజ్రీవాల్ మీడియాకు తెలిపారు. ప్రజా పనులకు ఆటంకం కలిగించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.