ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు కార్మికులను స్వస్థలాలకు పంపిందని, దీని కారణంగానే యూపీ, బిహార్తో సహా పలు రాష్ట్రాలకు పంపించిందని మోదీ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందిస్తూ… ప్రధాని మోదీ చాలా తక్కువ మాట్లాడి, అన్నీ అబద్ధాలే చెప్పారని మండిపడ్డారు. ఒకరిపై ఒకరు అభాండాలు వేసుకోవడం మంచిది కాదని, వీటితో ప్రజల ముందు చులకన అయిపోతామని ఉద్బోధించారు.
రాజకీయం నాకు రాదు : కేజ్రీవాల్
తనకు రాజకీయాలు చేయడం రాదని, తనకి ఇదే పెద్ద బలహీనత అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. తిట్టడం కూడా రాదని, నువ్వెంత అంటే నువ్వెంత? అని అనడం కూడా తనకు చేతకాదన్నారు. పాఠశాలలు నిర్మించడం, నాణ్యమైన విద్యుత్ను అందించడం లాంటివి మాత్రమే వచ్చని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడ పాఠశాలలు నిర్మించాలన్నా, విద్యుత్ సరఫరా బాగుండాలన్నా, ఆస్పత్రులు నిర్మించాలన్నా తనను పిలవాలని కేజ్రీవాల్ సూచించారు.
పంజాబ్ కాంగ్రెస్పై కూడా కేజ్రీవాల్ విమర్శలు చేశారు. కాంగ్రెస్ బస్సులో ఎవరూ లేరని, ఎన్నికల్లో ఓడిపోతుందని ఎద్దేవా చేశారు. సీఎం చెన్నీ రెండు సీట్ల నుంచి బరిలోకి దిగుతున్నారని, రెండు సీట్లలోనూ ఓడిపోతారన్నారు. ఒకవేళ తాము పోటీలోంచి తప్పుకున్నా… కాంగ్రెస్ ఉద్ధరించేది ఏమీ ఉండదని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు.