న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ బిజీగా గడుపుతున్నారు. వసంత్ విహార్లో నిర్మిస్తున్న టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం సందర్శించారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు సంతోష్ కుమార్, దీవకొండ దామోదర్ రావుతో పాటు పలువురు ఉన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయ నిర్మాణ పనులకు సంబంధించి ఇంజినీర్లకు కేసీఆర్ పలు సూచనలు చేశారు. వీలైనంత త్వరగా పార్టీ ఆఫీసు నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్ రెండో రోజు ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.
ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు నిన్న సీఎం కేసీఆర్ ఉత్తరప్రదేశ్కు వెళ్లిన సంగతి తెలిసిందే. అంత్యక్రియల అనంతరం కేసీఆర్ ఢిల్లీకి చేరుకున్నారు. రెండు, మూడు రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలోనే మకాం వేయనున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీని ప్రకటించిన తర్వాత కేసీఆర్ ఢిల్లీకి వెళ్లడం ఇదే తొలిసారి.