న్యూఢిల్లీ, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి సీఎం కేసీఆర్ విడుదల చేసిన కమల్ ఫైల్స్ వీడియోను బుధవారం సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ‘అవినీతిపరులు దేశాన్ని నాశనం చేస్తున్నారు. ధనబలంతో తప్పించుకుంటున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మేం ఒక వీడియో చూశాం.. అందులో ఎన్నికైన ప్రజాప్రతినిధులను కోట్లు పోసి కొనడం గురించి కొందరు మాట్లాడారు. మనం కండ్లు మూసుకుంటే తప్ప అంతా కనిపిస్తుంది’. అ ని బుధవారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎల్గార్ పరిషద్ కేసులో గౌతమ్ నవలాఖ వైద్యచికిత్స నిమిత్తం తనను జైలు నుంచి గృహనిర్బంధానికి మార్చేందుకు అనుమతించాలని దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ హృషికేశ్ రాయ్తో కూడిన ధర్మాసనం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.
వీడియోలోని ఎమ్మెల్యేల కొనుగోలుదారులపై వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదిస్తూ ఎల్గార్ పరిషద్కు చెందినవారు అమాయకులు కాదని, దేశాన్ని నాశనం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. దీనిపై ధర్మాసనం ఘాటుగా స్పందిస్తూ.. ‘ఈ దేశాన్ని నాశనం చేస్తున్నది ఎవరో తెలుసా? అవినీతి పరులే. వారిపై చర్య ఎవరు తీసుకుంటారు?’ అని నిలదీసింది. ఈ సందర్భంగానే కమల్ ఫైల్స్ వీడియోను ధర్మాసనం సూటిగా ప్రస్తావించింది. అవినీతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అవినీతిపరులపై మండిపడింది. ‘వారు దేశానికి వ్యతిరేకంగా ఏమీ చేయడం లేదని మీరంటున్నారా? మీరు కాపాడకపోయినా వాళ్లు యథేచ్ఛగా రెచ్చిపోతారు. ఏం జరిగినా బైటపడేసేందుకు వారివద్ద డబ్బుమూటలున్నాయి’ అంటూ మండిపడింది.
అదనపు సొలిసిటర్ జనరల్ దీనికి సమాధానమిస్తూ తాను అవినీతిపరుల వకాల్తా పుచ్చుకోవడం లేదని అన్నారు. వారిపై చర్య తీసుకోవాల్సిందేనని అన్నారు. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తూ, గౌతమ్కు వైద్య సేవలు అందించేందుకు తగిన వసతులు ముంబైలోని తలోజా జైల్లో లేవన్నారు. గృహనిర్బంధానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ మేరకు గౌతమ్ వినతిని బాంబే హైకోర్టు గత ఏప్రిల్ 26న తిరసరించిందని చెప్పారు. వైద్య నివేదికలను పరిశీలిస్తే జైల్లో వైద్యసేవలు అందించడం అసాధ్యమని, అనూహ్యంగా బరువు తగ్గిపోయాడని తెలిపారు. అనంతరం సుప్రీంకోర్టు.. గౌతమ్ ను గృహనిర్భందంలోకి పెట్టాల్సివస్తే ఎలాంటి షరతులు విధించాలో చెప్పాలని ఎన్ఐఏను ఆదేశించింది. దేశానికి వ్యతిరేకంగా ఏమైనా జరిగితే తాము ఉపేక్షించబోమని తేల్చి చెప్పింది. దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడితే గౌతమ్ స్వేచ్ఛను కోల్పోతారని హెచ్చరించింది. ‘గౌతమ్కు 70 ఏండ్లు. చాలా ఆరోగ్య సమస్యలున్నాయి. ఆ వయసులో సమస్యలు సహజం. నిరాశలోకి జారీపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే గౌతమ్ను గృహనిర్బంధంలో ఉంచాలని ఉత్తర్వులు జారీ చేయాల్సివస్తే ఎలాంటి షరతులు విధించాలో ప్రతిపాదించాలి’ అని ఎన్ఐఏకు సూచించింది.