న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి చేరుకున్నారు. సోమవారం సాయంత్రం బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ బయల్దేరిన సంగతి తెలిసిందే. ఢిల్లీ ఎయిర్పోర్టులో సీఎం కేసీఆర్కు మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ స్వాగతం పలికారు. ఈ నెల 14వ తేదీన ఢిల్లీలోని సర్దార్పటేట్ మార్గ్లో బీఆర్ఎస్(భారత రాష్ట్ర సమతి) పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఈ నేపథ్యంలో పార్టీ నూతన కార్యాలయం ప్రారంభానికి ఏర్పాట్లు చురుగ్గ్గా సాగుతున్నాయి. సీఎం కేసీఆర్ ఢిల్లీలో మంగళ, బుధవారాల్లో రాజశ్యామల యాగం నిర్వహించనున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ సంతోష్కుమార్ ఆది, సోమవారాల్లో ప్రముఖ వాస్తు శిల్పి సుద్దాల సుధాకర్ తేజతో కలిసి ఆయా ఏర్పాట్లను పరిశీలించారు. వాస్తుకు అనుగుణంగా కార్యాలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. సుధాకర్ తేజ సూచనల ప్రకారం పార్టీ కార్యాలయ భవనంలో మార్పులు, చేర్పులు, మరమ్మతు పనులు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి వివిధ రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్ ప్రతినిధులు హాజరుకానున్నారు. వారితో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలు ప్రారంభోత్సవానికి హాజరవుతామని పార్టీ కార్యాలయానికి సమాచారం అందిస్తున్నారు.
తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున చట్ట సభల ప్రజాప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు,
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సైతం ఢిల్లీకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఢిల్లీలో ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం దేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్టు పార్టీ నాయకుల ద్వారా తెలిసింది. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఢిల్లీ వీధుల్లో పెద్ద ఎత్తున హోర్డింగ్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. కేసీఆర్ ఫర్ ఇండియా, దేశ్ క నేత.. కిసాన్ కీ భరోసా, అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదాలతో హోర్డింగ్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.