న్యూఢిల్లీ: రాష్ట్రంలో లాక్డౌన్ పెట్టాలని భావించట్లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ప్రజలు మాస్కు పెట్టుకుంటే లాక్డౌన్ అవసరం లేదన్నారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించడంతోపాటు భౌతికదూరం పాటించాలని సూచించారు. కరోనా నుంచి కోలుకున్న సీఎం కేజ్రీవాల్ తొలిసారిగా కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు.
ఢిల్లీలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నదని వెల్లడించారు. ఆదివారం కొత్తగా 22 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. కేసుల సంఖ్యతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. కొవిడ్ రెండో దశతో పోల్చితే మరణాలు చాలా తక్కువగా ఉన్నాయని వెల్లడించారు. కాగా, తాను కరోనా నుంచి కోలుకున్నానని ఆదివారం ఉదయం కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ నెల 4న ఆయనకు కరోనా నిర్ధారణ అయింది. దీంతో అప్పటినుంచి హోం ఐసోలేషన్లో ఉన్నారు.
ఢిల్లీలో శనివారం 20,181 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 15,26,979కి చేరాయి. ఇందులో 14,53,658 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 48,178 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మరో 25,143 మంది వైరస్ వల్ల మరణించారు.