న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థలో మహిళలకు 50 రిజర్వేషన్లు ఉండాలని అభిప్రాయపడ్డారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వీ రమణ. అంతేకాదు దేశ వ్యాప్తంగా న్యాయ కళాశాలల్లోనూ ఇలాంటి రిజర్వేషన్లకు ఆయన మద్దతు పలికారు. తనతోపాటు కొత్తగా జడ్జీలుగా ప్రమాణం చేసిన 9 మందికి సుప్రీంకోర్టు మహిళా న్యాయవాదులు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో సీజేఐ రమణ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది మీ హక్కు. ఆ రిజర్వేషన్లను మీరు డిమాండ్ చేయాలి అని రమణ వాళ్లకు సూచించారు.
న్యాయవ్యవస్థలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఉండాలి. ఇది వేల సంవత్సరాల అణచివేతకు సంబంధించిన సమస్య. న్యాయవ్యవస్థ కింది స్థాయిలో 30 శాతం కంటే తక్కువ మంది మహిళలు జడ్జీలుగా ఉన్నారు. హైకోర్టులలో ఇది కేవలం 11.5 శాతం. సుప్రీంకోర్టులో 11-12 శాతం మాత్రమే అని రమణ అన్నారు. ఇక దేశవ్యాప్తంగా 17 లక్షల మంది న్యాయవాదులు ఉంటే.. కేవలం 15 శాతం మంది మాత్రమే మహిళలు.
రాష్ట్రాల బార్ కౌన్సిల్స్లో వీళ్ల నుంచి రెండు శాతం మందే ప్రతినిధులుగా ఉన్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ కమిటీలో ఒక్క మహిళ కూడా ఎందుకు లేదు అని నేను ప్రశ్నించాను అని సీజేఐ రమణ అన్నారు. ఈ అంశాలపై తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. డాటర్స్ డే శుభాకాంక్షలు చెబుతూ.. ఇది అమెరికా సంస్కృతి అయినా.. కొన్ని మంచి విషయాలను ప్రపంచమంతా సెలబ్రేట్ చేసుకోవాలని రమణ అన్నారు.