పట్నా: లాలూప్రసాద్ యాదవ్ అభిప్రాయాలను తాను గౌరవిస్తానని ఎల్జేపీ అధ్యక్షుడు, దివంగత రాంవిలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్ చెప్పారు. ఈ ఉదయం లాలూప్రసాద్ యాదవ్ మీడియాతో మాట్లాడుతుండగా.. ఎల్జేపీలో చీలిక అంశాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు. దానిపై స్పందించిన లాలూ యాదవ్ ఏదేమైనా ఎల్జేపీ అధ్యక్షుడు మాత్రం చిరాగ్ పాశ్వానే అని వ్యాఖ్యానించారు.
భవిష్యత్తులో చిరాగ్ పాశ్వాన్, తేజస్వియాదవ్ కూటమి కడుతారా అన్న ప్రశ్నకు లాలూ.. తాను కూడా అదే కోరుకుంటున్నానని చెప్పారు. ఈ నేపథ్యంలో లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యలను చిరాగ్ ముందు ప్రస్తావించగా ఆయన వ్యాఖ్యలను తాను గౌరవిస్తానని చెప్పారు. అయితే, ప్రస్తుతం తన దృష్టి మొత్తం పార్టీని బలోపేతం చేసే ఆశీర్వాద్ యాత్రపై ఉన్నదని చెప్పారు. యూపీలో, బీహార్లో పొత్తులకు సంబంధించి ఎన్నికల సమయంలో మాట్లాడుతానని పేర్కొన్నారు.