న్యూఢిల్లీ : సరిహద్దుల్లో డ్రాగన్ మరోసారి రెచ్చిపోయింది. దుందుడుకు చర్యలతో కవ్విస్తున్న చైనా మళ్లీ దుస్సాహసానికి తెగబడుతోంది. లడఖ్లో జూన్ చివరి వారంలో నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి భారత స్ధావరాలకు అతి సమీపంలో చైనా విమానం ఎగిరింది. వెంటనే అప్రమత్తమైన భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఎలాంటి దుస్సాహసం ఎదురైనా తిప్పికొట్టేందుకు సంసిద్ధమైందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
తూర్పు లడఖ్ ప్రాంతంలో భారత్ గగనతలంలోకి ప్రవేశించేందుకు డ్రాగన్ గత కొద్దినెలలుగా ప్రయత్నిస్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుందని అధికార వర్గాలు తెలిపాయి. సరిహద్దు ప్రాంతంలో మోహరించిన ఓ ఐఏఎఫ్ రాడార్ చైనా విమాన కదలికలను పసిగట్టింది. తూర్పు లడఖ్లో తన ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో చైనా ఎయిర్ ఫోర్స్ భారీ విన్యాసాలు చేపట్టిన నేపధ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ ఘటనపై ఉన్నతాధికారులు చైనా దృష్టికి తీసుకువెళ్లి భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా నిరోధించాలని కోరాయి. 2020 తరహాలో సరిహద్దుల్లో చైనా ఎలాంటి దుస్సాహసానికి తెగబడినా తిప్పికొట్టేందుకు భారత్ సర్వసన్నద్ధంగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి.