న్యూఢిల్లీ, మే 18: తూర్పు లఢక్లో వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతంలో పాంగాంగ్ సరస్సుపై చైనా మరో వంతెనను నిర్మిస్తున్నది. వాస్తవాధీన రేఖకు అటువైపున 20 కిలోమీటర్ల దూరంలో నిర్మిస్తున్నారు. పాంగాంగ్ సరస్సుపై చైనా నిర్మిస్తున్న రెండో వంతెన ఇది. ఇటీవలే చైనా ఒక బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఉపగ్రహ చిత్రాల ద్వారా ఈ వంతెన నిర్మాణం వెలుగులోకి వచ్చింది. డేమియన్ సైమన్ అనే పరిశోధకుడు ఈ చిత్రాలను ట్వీట్ చేశారు.
తూర్పు లఢక్లో భారత్, చైనా మధ్య రెండేండ్లుగా ఘర్షణలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బ్రిడ్జి నిర్మాణంపై భారత ప్రభుత్వం స్పందించలేదు. మరోవైపు, వాస్తవాదీన రేఖ (ఎల్ఏసీ) వెంట చైనా మౌలిక వసతులను పెంచుకుంటున్నది. అరుణాచల్ప్రదేశ్కు అతీ సమీపాన రోడ్లు, రైలు, వాయు మార్గాలను ఆధునీకరిస్తున్నది. 5జీ నెట్వర్క్ను ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే ఎల్ఏసీ వెంట కొత్త గ్రామాలను నిర్మించిన చైనా.. తాజాగా మౌలిక వసతులను ఆధునీకరించుకుంటుండటంపై భారత సైన్యం ఓ కన్నువేసి ఉంచింది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దీటుగా సమాధానమివ్వడానికి సిద్ధమవుతున్నది. తాను కూడా మౌలికవసతుల ఆధునీకరణను చేపడుతున్నది.