కోల్కతా: పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ వైఖరిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ తొక్కిపెడుతున్నారని మండిపడ్డారు. ఇదే వైఖరి కొనసాగితే రాజ్భవన్ ఎదుట ధర్నాకు దిగుతానని హెచ్చరించారు.
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మమత మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న యూనివర్సిటీ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం చేసుకుంటున్నారని విమర్శించారు. గవర్నర్ ఆదేశాల మేరకు ఆ యూనివర్సిటీలు నడుచుకుంటే ప్రభుత్వం నుంచి నిధులు ఆపేస్తానని హెచ్చరించారు.