Congress : గోవా ఎన్నికల్లో పొత్తులపై తామెవ్వరినీ ఒత్తిడి చేయమని కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం స్పష్టం చేశారు. శివసేన, ఎన్సీపీతో పొత్తు కోసం ప్రయత్నాలు చేసినా, అవి ఫలించలేవని తేల్చి చెప్పారు. అయితే ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసినా, తమ మధ్య మిత్రత్వం ఉంటుందని, ఎన్నికల తర్వాత వారితో కలిసే పనిచేస్తామన్నారు. అయితే తృణమూల్పై మాత్రం చిదంబరం తీవ్రంగా సీరియస్ అయ్యారు. కలిసి పనిచేద్దామని తాము ఆఫర్ ఇచ్చినా, తమ ఎమ్మెల్యేలనే కొనుగోలు చేయడానికి తృణమూల్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
అయితే పొత్తు విషయంలో తృణమూల్తో చర్చలు జరపాలని అధిష్ఠానం తనను ఆదేశించలేదని, స్థానిక పరిస్థితులు, వాస్తవాలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకునే నిర్ణయాలు తీసుకుంటుందని పేర్కొన్నారు. గోవా సీఎం అభ్యర్థిని ముందుగానే ప్రకటించాలా? ఎన్నికల తర్వాత ప్రకటించాలా? అన్న విషయం స్థానిక నేతలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని, వారితో చర్చించిన తర్వాతే ఓ నిర్ణయానికి వస్తామని ఆయన స్పష్టం చేశారు. అయితే గోవాలో పోటీ మాత్రం బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉంటుందని చిదంబరం స్పష్టం చేశారు.