నల్లగొండ జిల్లాలోని ‘పరడ’ ప్రాచీన నగరంగా ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామానికి బయట ఉన్న కొండకు తూర్పుభాగంలో శిథిల ఆంజనేయ, శివాలయాలు ఉన్నాయి. ఆంజనేయస్వామి ఆలయం దగ్గర నల్లసరపు రాతిపై ఒక శాసనం ఉంది. ఈ శాసనాన్ని కీ.శే. బి.ఎన్.శాస్త్రిగారు మొదటిసారి వెలుగులోకి తెచ్చారు. ఈ శాసనం కందూరి చోడ వంశానికి చెందిన ఉదయనచోడ మహారాజు కాలంలో వేయించినది.
కందూరిచోడులు కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా, మహామండలేశ్వరులుగా ఉన్న విషయం విదితమే. ఈ శాసనంలో చాళుక్య చక్రవర్తి అయిన జగదేకమల్ల దేవుని ప్రశంస ఉంది. ఇతడు శ్రీమత్ప్రతాప చక్రవర్తిగా కీర్తించబడినాడు. ఈ శాసనము రక్తాక్షి సంవత్సర పుష్య బహుళ ఆదివారం నాడు జగదేక చక్రవర్తి 7వ రాజ్య సంవత్సరంలో వేయించబడింది. దానిని శా.శ 1065= క్రీ.శ 1143గా శాస్త్రి నిర్ణయించారు.
ఉదయనచోడ మహారాజు ప్రభుత్వమును అష్టస్వామ్య భోగముగా అనుభవించడానికి కౌండిన్య గోత్రజుడైన కరణం బ్రహ్మదేవని కాళ్ళు కడిగి ధారా పూర్వకముగా దానమిచ్చిన విషయము ఈ శాసనంలో ఉంది.
శాసనము 3,4 ప్రక్కలందు కందూరు ఉదయనచోడ మహారాజు కరణము అయిన బ్రహ్మదేవండు దానమిచ్చిన విషయం ఉన్నది. ఇందు లో కందూరు 1100లోని ఆమనకంటి 70లో ఉన్న పరడ గ్రామానికి తూర్పున నివసిస్తున్న పురోహితుల వారికి గల భూమిలో మూడవ వంతు తమ తండ్రి మల్లపరాజు పేరు మీద కట్టించిన మల్ల సముద్రం చెరువు కింద ఒక మర్తురు భూమి, వెలిపొలము; నెమ్మాని ప్రభుత్వంలో గల నాలుగో వంతు భూమి సూర్య గ్రహణ సమయంలో తన తండ్రికి ధర్మార్థముగా సర్వకర పరిహారముగా దానమిచ్చాడు.
కందూరి ఉదయన చోడ మహారాజు వేయించిన శాసనము చివర తెలుగు పద్యముంది.
‘నమ్మాశేషమరున్నికాయుండు జగన్నాథుండు రక్షింపగా /సాంమ్రాంజ్యంబుదయ క్షితీశ్వరునకా చంద్రార్క తారంబుగాన్/ (స)సమ్మానంబడసెం బ్రభుత్వము హిమానీహార చంద్ర ప్రభా / కమ్రశ్లోకుండు బ్రహ్మదేవ నిభుండాకల్పాన్తర స్థాయిగాను..’
శాసనములో ఉదయనచోడ మహారాజు ‘సమధిగత, పంచమహా శబ్ద, మ హా మండలేశ్వర, వీర మహేశ్వర, కోడూర్పురవరేశ్వర, కాశ్యప గోత్ర, కరి కాలాన్వయ నామాది సమస్త ప్రశస్తి సహితు’డని వర్ణించబడినాడు. శాసనాంతమున వ్యాస గీతా శ్లోకములున్నవి. దాన ఫలములు వివరించబడినవి.