CM Bhupesh Baghel | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): ఛత్తీస్గఢ్ కాంగ్రెస్పై అక్కడి ప్రజలు, రైతన్నలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఓట్లు అడిగేందుకు రావద్దంటూ కోర్బా జిల్లాలోని రామ్పూర్ సహా పలు గ్రామాల్లో ఏకంగా బ్యానర్లను ఏర్పాటుచేసి తమ నిరసనను తెలియజేశారు. దీంతో రాష్ట్రంలో ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలనుకొంటున్న కాంగ్రెస్.. హామీల వర్షాన్ని కురిపిస్తున్నది. కులగణన, ధాన్యం సేకరణ, పేదలకు ఇండ్ల నిర్మాణం తర్వాత రైతుల రుణాన్ని ఇంకోసారి మాఫీ చేస్తామంటూ మరో హామీని గుప్పించింది. ఈ మేరకు బఘేల్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. అయితే, రుణమాఫీ విషయంలో గతంలో మోసం చేసిన కాంగ్రెస్ సర్కారుకు మళ్లీ ఓటేయబోమంటూ రైతన్నలు ప్రమాణాలు చేస్తున్నారు.
అలా మోసం చేశారు
అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే రైతు రుణాలన్నీ మాఫీ చేస్తామని 2018లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ దాన్ని నిలబెట్టుకోలేకపోయింది. 35 లక్షల మంది రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామన్న ఆ పార్టీ.. 13.46 లక్షల మంది రైతులు సహకార బ్యాంకుల్లో తీసుకున్న రూ. 5,260 కోట్ల విలువ చేసే స్వల్పకాలిక రుణాలనే చెల్లించింది. పబ్లిక్ సెక్టార్ జాతీయ బ్యాంకులు, రాష్ట్ర గ్రామీణ బ్యాంకులు, వాణిజ్య బ్యాంకుల్లో రైతులు తీసుకొన్న రుణాలను మాఫీ చేయలేదు. అంతేకాదు, 2019లో సీఎం బఘేల్ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది నుంచి రుణమాఫీ ఉండబోదని తేల్చిచెప్పారు. దీంతో పలువురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయినప్పటికీ, సర్కారు రుణమాఫీపై ముందుకు కదల్లేదు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మళ్లీ అధికారాన్ని అప్పగిస్తే రుణమాఫీ చేస్తామంటూ కాంగ్రెస్ అబద్ధపు హామీలు గుప్పిస్తున్నది.
తెలంగాణలో రుణమాఫీ ఇలా
ఒకవైపు కాంగ్రెస్ పాలనలోని ఛత్తీస్గఢ్లో రైతు రుణమాఫీ దుస్థితి అలాగుంటే, మరోవైపు కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణలో రైతు రుణమాఫీ సంపూర్ణమైంది. రూ.లక్షలోపు పంట రుణాలను మాఫీ చేస్తామని 2014లో ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నెరవేర్చారు. 2018లో మరోసారి రుణమాఫీకి హామీ ఇచ్చారు. ఈ మేరకు ఈ రెండు దఫాల్లో మొత్తం 40.74 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ. 17,351 కోట్ల పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. 29.61 లక్షల రైతు కుటుంబాలకు చెందిన రూ.19 వేల కోట్ల రుణాలను మాఫీ చేయనున్నట్టు గత ఆగస్టులో మరోసారి కేసీఆర్ హామీ ఇచ్చారు. దీంతో తెలంగాణలో రైతు రుణమాఫీ సంపూర్ణమయినట్లయింది.