Chardham Yatra | చార్ధామ్ యాత్రలో విషాదం చోటు చేసుకున్నది. ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్లో ఇద్దరు, యమునోత్రి ధామ్లో మరో ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఇప్పటి వరకు యాత్రలో ప్రాణాలు కోల్పోయిన భక్తుల సంఖ్య 157కి చేరింది. యాత్రలో ఇప్పటివరకు అత్యధికంగా కేదార్నాథ్లో 73 యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. బద్రీనాథ్లో 38, గంగోత్రిలో 13, యమునోత్రి ధామ్లో 29 మంది ప్రాణాలు విడిచినట్లుగా అధికార వర్గాలు తెలిపాయి. అయితే, బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ధామ్లు ఎత్తయిన హిమాలయపర్వతాల్లో ఉన్నాయి. ఎక్కడ ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి. అదే సమయంలో ఎప్పటికప్పుడు వాతావరణం మారిపోతూ ఉంటుంది. శీతల ప్రాంతం కావడంతో ఎక్కువ మంది యాత్రికులు గుండెపోటుతో మరణిస్తున్నట్లుగా తెలుస్తున్నది.
అందులో ఎక్కువగా వృద్ధులే ఉంటున్నారని అధికార వర్గాలు తెలిపాయి. అయితే, యాత్రకు వెళ్లే భక్తులకు వైద్యాధికారులు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు జారీ చేస్తుంటారు. ఆరోగ్య పరిస్థితి బాగోలేదని భక్తులు ప్రయాణం చేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు. వైద్యుల మాట వినకుండా ఎవరైనా యాత్రకు వెళితే రాతపూర్వకంగా ఫారం నింపేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాలినడకన కేదార్నాథ్, యమునోత్రి ధామ్లను సందర్శించే సమయంలో గంట నుంచి రెండు గంటల తర్వాత ఐదు నుంచి పది నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. వచ్చని బట్టలు.. వాన నుంచి రక్షణ కోసం రెయిన్కోట్తో పాటు పల్స్ ఆక్సిమీటర్, థర్మామీటర్ తదితర పరికరాలు వెంట తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. అయితే, గుండెజబ్బులు, హైబీపీ, ఉబ్బసం, మధుమేహం తదితర సమస్యలతో బాధపడేవారంతా మందులతో పాటు వైద్యుల నంబర్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.