Chardham Yatra | చార్ధామ్ యాత్రలో విషాదం చోటు చేసుకున్నది. యాత్ర ప్రారంభమైన 16 రోజులు 56 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 50 ఏళ్లు పైబడిన 40 మంది ఉన్నారు. 47 మంది గుండెపోటు, పల్మనరీ ఎడెమా కారణంగా మరణించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నారు. అత్యధికంగా కేదార్నాథ్ ధామ్ యాత్ర మార్గంలో ఇప్పటి వరకు గరిష్ఠంగా 27 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం సాయంత్రం నలుగురు గుండెపోటుతో మరణించారు. బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి సముద్రమట్టానికి ఎత్తున హిమాలయప్రాంతాల్లో ఉన్నాయి.
చలితో పాటు ఆక్సిజన్ అందక శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. మే 10న మొదలైన చార్ధామ్ యాత్రలో 15 రోజుల్లో 52 మంది యాత్రికులు గుండెపోటు, పల్మనరీ ఎడెమా, అల్పోష్ణస్థితి (శరీర ఉష్ణోగ్రత తగ్గిన సమయంలో గుండెపోటు ఆగిపోవడం), తలకు బలమైన గాయాల కారణంగా మరణించారు. ఇప్పటి వరకు 56 మంది భక్తులు యాత్ర కోసం వచ్చి ప్రాణాలు కోల్పోయారని గర్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే ధ్రువీకరించారు. మృతుల్లో అత్యధికంగా 60 సంవత్సరాలు పైబడిన వ్యక్తులే ఉన్నారని.. ఇందులో ఎక్కువగా గుండెపోటు బాధితులే ఎక్కువగా ఉన్నారన్నారు.
ఆరోగ్యం బాగాలేని వ్యక్తులు యాత్రకు వెళ్లకపోవడమే మంచిదని పరీక్షలు నిర్వహించిన అనంతరం వైద్యులు సూచిస్తున్నారు. అయినా యాత్రను ముందుకు వెళ్లాలనుకునే వ్యక్తుల నుంచి రాతపూర్వకంగా ఫారం నింపేలా చర్యలు తీసుకుంటున్నారు. హిమాలయ పర్వతాల ఎత్తయిన ప్రాంతాల్లో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పర్యాటకులకు ఆరోగ్య శాఖ సూచించింది. కేదార్నాథ్, యమునోత్రి ధామ్లకు కాలినడకన వెళ్లే సమయంలో ఒకటి నుంచి రెండు గంటల మధ్యలో ఐదు నుంచి పది నిమిషాలు విరామం తీసుకోవాలని సూచిస్తున్నారు.
వెచ్చని బట్టలు, వర్షంలో తడవకుండా రెయిన్ కోట్స్, పల్స్ ఆక్సిమీటర్, థర్మామీటర్ వెంట తీసుకువెళ్లాలని.. గుండె జబ్బులు, అధిక రక్తపోటు, ఉబ్బసం మధుమేహంతో బాధపడే ప్రయాణికులు అవసరమైన మందులు, డాక్టర్ నంబర్ను తమ వద్ద ఉంచుకోవాలని చెప్పింది. ప్రయాణంలో ఛాతినొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, వాంతులు వచ్చినప్పుడు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స తీసుకోవాలని ఆరోగ్యశాఖ సూచించింది.