నంద్యాల: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో (Skill scam) ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని (Chandrababu Naidu) సీఐడీ పోలీసులు (AP CID police) అరెస్టు చేశారు. యాత్రలో భాగంగా నంద్యాలలో (Nandyal) బస చేస్తున్న ఆయనను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి విజయవాడకు (Vijayawada) తరలిస్తున్నారు. అంతకుముందు భూమా అఖిలప్రియ, కాలువ శ్రీనివాసులు, భూమా బ్రహ్మానందరెడ్డి, జగత్ విఖ్యాత్ రెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి, బీజీ జనార్దన్ రెడ్డి సహా పలువురు టీడీపీ నాయకులను పోలీసులు అరెస్టుచేశారు. కాగా, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా, నోటీసులు ఇవ్వకుండా తనను ఎలా అరెస్టు చేస్తారని పోలీసులను బాబు నిలదీశారు. ఏదో జరిగిందని తనపై కేసు పెడుతున్నారని, మీకూ, నాకు రాజ్యాంగమే ఆధారమని ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే హైకోర్టుకు ప్రాథమిక ఆధారాలు ఇచ్చామని పోలీసులు స్పష్టం చేశారు. రిమాండ్ రిపోర్టులో అన్నీ ఉన్నాయని చెప్పారు.
టీడీపీ హాయంలో 2016 నుంచి 2019 మధ్యకాలంలో బోగస్ కాంట్రాక్టుల ద్వారా రూ.118 కోట్ల ప్రజాధనం ముడుపుల రూపంలో చేతులు మారినట్లు ఇటీవల అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ద్వారా షాపూర్జీ పల్లోంజీ సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ సబ్ కాంట్రాక్టర్గా అవతారం ఎత్తి ఈ డబ్బులను తమ ఖాతాల్లోకి మల్లించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ అవినీతి బాగోతం బట్టబయలు కావడంతో స్పందించిన ఐటీ అధికారులు.. చంద్రబాబుతో పాటు శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్, యోగేశ్ గుప్తాకు నోటీసులు అందజేశారు. గత వారం వాళ్ల నివాసాల్లో తనిఖీలు కూడా చేపట్టారు. ఈ క్రమంలో బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ ద్వారా ముడుపులు చేతులు మారినట్లు మనోజ్ వాసుదేవ్ అంగీకరించినట్లు ఐటీ అధికారులు వెల్లడించారు. 2016 నుంచి 2019 మధ్య ఎన్ని కాంట్రాక్టులు పొందారు? అందుకు డబ్బులను ఎలా సమకూర్చారు? డబ్బులు ఎలా చేతులు మారాయనే అంశాలకు సంబంధించిన వాంగ్మూలం ఇచ్చారని స్పష్టం చేశారు. ఈ క్రమంలో మనోజ్, పీఏ శ్రీనివాస్ విదేశాలకు పరారవ్వడంతో ఐటీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఐటీ నోటీసుల ఆధారంగా కేసు నమోదుసిన ఏపీ సీఐడీ దర్యాప్తు ప్రారంభించింది.
#WATCH | Andhra Pradesh: Criminal Investigation Department (CID) serves arrest warrant to TDP chief and former Andhra Pradesh CM N Chandrababu Naidu. pic.twitter.com/C2vtCJW0bi
— ANI (@ANI) September 9, 2023