KCR | మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చిందని.. ముఖ్యమంత్రి నోటికే మొక్కాలంటూ బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు విమర్శించారు. రోడ్షోలో భాగంగా ఖమ్మం జడ్పీ సెంటర్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆ నాడు మీకు బాగా గుర్తుంది. నేను ఒక్కడిగా బయలుదేరిన నాడు తెలంగాణ వస్తదని ఎవరికీ నమ్మకం లేదు. నేను ఆమరణ దీక్షకు పూనుకున్నా. నన్ను అరెస్టు చేసి ఇదే ఖమ్మం జిల్లా జైలుకు తీసుకువచ్చారు. ఆ నాడు ఖమ్మం జిల్లా బిడ్డలు నాకు బ్రహ్మరథంపట్టి ఆశీర్వదించి మద్దతు తెలిపారు. ఆ ఘటనను నేను మరిచిపోలేను.
చివరికి తెలంగాణ వచ్చింది. పదేళ్లలో పూలపొదరిల్లులా బ్రహ్మాండంగా కులం, మతం, జాతి ప్రసక్తి లేకుండా అన్నివర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని సాదుకున్నాం. పేదసాదలను ఆదుకున్నాం. రైతాంగాన్ని ఆదుకున్నాం. రైతుబీమా అందించాం. 24 గంటలు కరెంటు సదుపాయాం కల్పించాం. రైతుబంధు ఇచ్చాం. రైతుల పంటలు కళ్లాల నుంచి కొనుగోలు చేశాం. 7500 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేసి.. దళారులు లేకుండా బ్యాంకుల్లో వేశాం. కానీ, మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, ఈ నాటి ముఖ్యమంత్రి అడ్డగోలు హామీలు. ఆయన నోటికి మొక్కాలి’ అంటూ విమర్శించారు.
‘ఎన్టీఆర్ రాకముందు కాంగ్రెసోళ్లు చెప్పేది. దున్నేవాడికే భూమి.. తినేవాడికే విస్తరని.. గీసేవాడికే గుండు అనేది. కానీ, నిజమైన సంక్షేమం ఈ రాష్ట్రంలో ప్రారంభమైంది ఎన్టీఆర్ తర్వాతనే. పేదలకు అన్నం దొరికింది. ఆ పుణ్యాత్ముడు పెట్టిన రూ.2కిలో బియ్యం ద్వారానే. ఈ రాష్ట్రంలో ఎవరన్నా కన్నా ఇది చరిత్ర. ఆ మహనీయుడు వచ్చిన తర్వాత రూ.2కే బియ్యం దొరికి పట్టెడు అన్నం దొరికిన మాట చారిత్రక సత్యం. అట్లనే పక్కా గృహ నిర్మాణాలు, జనతా వస్త్రాలు.. భూమిశిస్తు రద్దు చేయడం అనేక కార్యక్రమాలు, నిజమైన సంక్షేమం కాంగ్రెస్ చేయలేదు. ఎన్టీఆర్ కాలం నుంచే ప్రారంభమైంది. అది మనందరికీ తెలుసు.
అది చరిత్ర. తుడిసేస్తే పోయేది కాదు. దాని తర్వాత తెలంగాణ పోరాటం.. తెలంగాణ రావటం.. ఎన్టీఆర్కు మించి కార్యక్రమాలు మనం చేసుకున్నాం. రైతుబంధు, రైతుబీమా, 24గంటల కరెంటు, ధాన్యం కొనుగోళ్లు చేసుకున్నాం. గుంట భూమి ఉన్న రైతు చనిపోతే కూడా వారంలో వారి ఇంటికి రూ.5లక్షలు పంపించాం. కల్యాణలక్ష్మి పథకం పెట్టుకున్నం. ఏం చెప్పిండు ముఖ్యమంత్రి. కేసీఆర్ రూ.లక్ష ఇస్తున్నడు. నేను తులం బంగారం కూడా ఇస్తా అన్నడా? తులం బంగారం వచ్చిందా? తులం బంగారం తుస్సుమన్నది. ఇప్పుడు అడిగితే కాంగ్రెస్ కస్సుమంటున్నది. రైతుబంధు అడిగితే చెప్పుతో కొడుతా అంటున్నది. మంత్రిగారు నీకు అహంకారం ఉన్నది. నీకు చెప్పున్నది కొట్టడానికి. కానీ, రైతుల చెప్పుల బందబస్తు అంటయని చెప్పిన. వాళ్లు అవే తిరగేస్తే మీరు మాడిమసై పోతరు.. ఈ అహంకారం మంచిది కాదని చెప్పా’నన్నారు కేసీఆర్.