న్యూఢిల్లీ, మే 20: ఢిల్లీలో పాలనాధికారాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును బుల్డోజ్ చేస్తూ మోదీ సర్కార్ ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని సీఎం కేజ్రీవాల్ తీవ్రంగా తప్పుబట్టారు. కేంద్రం ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని పేర్కొన్నారు. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని తెలిపారు. సమాఖ్య వ్యవస్థపై కేంద్రం దాడి చేస్తున్నదని మండిపడ్డారు. ఆర్డినెన్స్ తీసుకురావడం ద్వారా బీజేపీ సర్కార్ సుప్రీంకోర్టు గౌరవాన్ని అవమానించిందని విమర్శించారు. ఢిల్లీ అధికారాలపై సుప్రీంకోర్టు తీర్పును కాలరాస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్.. దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని బహిరంగంగా సవాల్ చేసేలా ఉన్నదని ఆక్షేపించారు. మరోవైపు సుప్రీంకోర్టు ఈనెల 11న ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ఢిల్లీలో అధికారుల నియామకాలు, బదిలీలకు సంబంధించి ఎన్నికైన ప్రభుత్వ అధికారాలను తొలగిస్తూ.. దాని స్థానంలో కొత్తగా నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీ అనే ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్రం శుక్రవారం రాత్రి ఆర్డినెన్స్ జారీచేసిన విషయం తెలిసిందే.
అడుగడుగునా కేంద్రం కుట్రలు
సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడం ద్వారా కేంద్ర ప్రభుత్వం దేశ సర్వోన్నత న్యాయస్థానంతో ప్రత్యక్ష ఘర్షణకు దిగిందని కేజ్రీవాల్ అన్నారు. తీర్పు తర్వాత ఆర్డినెన్స్ తెచ్చేందుకు పక్కా వ్యూహంతో సుప్రీంకోర్టు వేసవి సెలవుల వరకు కేంద్రం వేచిచూసిందని పేర్కొన్నారు. ఈ ఆర్డినెన్స్కు సంబంధించిన బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందకుండా వివిధ పార్టీల నేతలను కలుస్తానని తెలిపారు. ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా త్వరలో ఓ భారీ ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడించారు.
ఆర్డినెన్స్లో ఏమున్నది?
అధికారుల పోస్టింగ్లు, బదిలీల విషయంలో తాము నియమించిన లెఫ్ట్నెంట్ గవర్నర్(ఎల్జీ)కు అసాధారణ అధికారాలు కట్టబెడుతూ కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చింది. ఈ ఆర్డినెన్స్తో అధికారుల పోస్టింగ్లు, బదిలీలపై ఎన్నికైన ప్రభుత్వానికి అధికారాలు పూర్తిగా రద్దయ్యాయి. నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీ పేరుతో ఏర్పాటు చేసే కమిటీకి చైర్మన్గా ఢిల్లీ సీఎం ఉంటారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సభ్యుడిగా, నగర హోంశాఖ కార్యదర్శి మెంబర్ సెక్రటరీగా ఉంటారు. నగరంలో ఏ అధికారిని బదిలీ చేయాలన్నా, పోస్టింగ్ ఇవ్వాలన్నా ఈ ముగ్గురు సమావేశమై, ఓటింగ్ నిర్వహించి ఎల్జీకి నివేదించాలి. ఈ అథారిటీ సిఫారసులను ఎల్జీ గౌరవించాల్సిన పనిలేదు. వాటిని కాదని తనకు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించవచ్చు. ఈ ఆర్డినెన్స్ కేంద్ర ప్రభుత్వ నియంత పోకడను ప్రతిబింబిస్తున్నదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
మా వాదనలను పరిగణించలేదు
ఈ నెల 11న ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా శనివారం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు. తీర్పులో కొన్ని లోపాలు ఉన్నాయని, రివ్యూ పిటిషనర్ వాదనలను పరిగణనలోకి తీసుకోవడంలో విఫలమైందని అన్నారు. అదేవిధంగా రాజధానిగా ఉన్న ఢిల్లీలో ప్రభుత్వ కార్యకలాపాలు దేశం మొత్తాన్ని ప్రభావితం చేస్తాయనే వాస్తవాన్ని తీర్పు విస్మరించిందని పిటిషన్లో పేర్కొన్నారు.