న్యూఢిల్లీ : నక్సలిజంపై పోరాటానికి మార్చి 31ని డెడ్లైన్గా పేర్కొన్న కేంద్రం.. ఈసారి కేంద్ర బడ్జెట్లో భారీగా నిధుల్ని కేటాయించింది. దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని తుదముట్టించేందుకు రూ.3,610 కోట్లు ఖర్చు చేయబోతున్నట్టు తాజా బడ్జెట్ ప్రతిపాదించింది. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో భద్రతాపరమైన ఖర్చులు, ప్రత్యేక మౌలిక వసతుల పథకం కోసం ఈ నిధులను రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేయనున్నట్టు తెలిపింది. కేంద్రం గత బడ్జెట్లో (సవరించిన అంచనాలు) రూ.3,006 కోట్లు ఖర్చు చేసినట్టుగా తెలిపింది. ఈసారి నిధుల వ్యయాన్ని 20 శాతానికి పైగా పెంచింది.
న్యూఢిల్లీ: ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగాన్ని మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తిగా విస్మరించారని ఆల్ ఇండియా కిసాన్ సభ (ఏఐకేఎస్) ఆరోపించింది. ఈ మేరకు ఆ సంఘం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. వ్యవసాయ రంగం వ్యూహాత్మక పునరుజ్జీవనం పట్ల ఏదైనా నిబద్ధతను ప్రదర్శించడంలో మరోసారి కేంద్రం విఫలమయ్యిందని విమర్శించింది. బడ్జెట్ ప్రసంగంలో సీతారామన్ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విస్మరించారన్నారు. చిన్న, సన్నకార రైతుల గురించి కేవలం ఒక్కసారి మాత్రమే ప్రస్తావించారన్నారు.
వ్యవసాయ ఉత్పత్తిని గణనీయంగా పెంచాలని ఒక పక్క మంత్రి పేర్కొంటూనే అగ్రికల్చరల్ రిసెర్చి అండ్ ఎడ్యుకేషన్ శాఖ బడ్జెట్ను రూ.10,281 కోట్ల నుంచి 9,967 కోట్లకు తగ్గించారని సంఘం విమర్శించింది. కొబ్బరి, కోకో, జీడిపప్పు, వేరుశనగ, చందనం పంటల ప్రాధాన్యతను మంత్రి నొక్కి చెప్పారని, వాస్తవానికి గతంలో చేపట్టిన పత్తి టెక్నాలజీ మిషన్, హైబ్రీడ్ విత్తనాలు, పప్పు ధాన్యాల మిషన్ల ప్రస్తావనే ఈ బడ్జెట్లో లేదని విమర్శించింది. అలాగే ఎంజీనరేగా ఉపాధి హామీ పథకం, దాని స్థానంలో తీసుకు వచ్చిన కొత్త పథకం గురించిన ప్రస్తావన కూడా ఈ బడ్జెట్లో లేదని ఏఐకేఎస్ విమర్శించింది.