passport fees : భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇవ్వబోతుంది. పాస్పోర్ట్ దరఖాస్తు, జారీ ధరల్ని పెంచబోతుంది. కొత్త పాస్పోర్ట్ జారీ ఫీజు రూ.2,500కు పెరగనుంది. అలాగే, తత్కాల్ పాస్పోర్ట్ ఫీజు రూ.5,000కు చేరనుంది. ఈ నిర్ణయం జూలై 1 నుంచి అమలుకాబోతుంది. ఈ విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ బుధవారం వెల్లడించింది. కొత్త ఫీజుల వివరాలతో పాస్పోర్ట్స్ (అమెండ్మెంట్) రూల్స్, 2026 పేరిట నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక, 2012 తర్వాత కేంద్రం వీసా ఫీజులు పెంచడం ఇదే మొదటిసారి.
18 ఏళ్లు దాటిన దరఖాస్తుదారులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. కొత్త, పాత ఫీజులకు సంబంధించిన వివరాలివి. 36 పేజీల పాస్పోర్ట్ ఫీజు ప్రస్తుతం రూ.1,500 ఉండగా, జూలై 1 నుంచి రూ.2,500కు పెరగనుంది. ఇదే పాస్పోర్ట్ తత్కాల్ ఫీజు ధర రూ.3,500 ఉండగా, ఇకపై దీని ధర రూ.5,000కు పెరగనుంది. అలాగే, సాధారణ విభాగం 60 పేజీల పాస్పోర్ట్ ధర ప్రస్తుతం రూ.2,000 ఉండగా, ఇకపై రూ.3,500కు పెరగనుంది. అలాగే, ఇదే పాస్పోర్ట్ తత్కాల్ ధర ప్రస్తుతం రూ.4,000 ఉండగా, ఇకపై దీని ధర రూ.6,000కు పెరగనుంది. అలాగే, పాడైపోయిన లేదా పోగొట్టుకున్న పాస్పోర్ట్ల స్థానంలో కొత్తది పొందాలన్నా అధిక ఫీజు చెల్లించాల్సిందే. తత్కాల్ ద్వారా 36 పేజీల రీప్లేస్మెంట్ పాస్పోర్ట్ ధర ప్రస్తుతం రూ.5,000 ఉండగా, ఇకపై దీని ధర రూ.7,500కు పెరగనుంది. అలాగే, 60 పేజీల తత్కాల్ పాస్పోర్ట్ ధర ప్రస్తుతం రూ.6,000 ఉండగా, ఇకపై దీని ధర రూ.8,500కు పెరగనుంది.
18 ఏళ్లకంటే తక్కువ వయసున్న వారి పాస్పోర్ట్ ఫీజు 36 పేజీలకు రూ.1,750, తత్కాల్ పథకం ద్వారా రూ.4,250గా ఉండనుంది. 8 ఏళ్లకంటే తక్కువ వయసున్న వారి పాస్పోర్ట్ రీప్లేస్మెంట్కు రూ.4,250, తత్కాల్ ద్వారా రూ.6,750గా నిర్ణయించింది కేంద్రం. దేశంలో ఏదైనా ఎమర్జెన్సీ సర్టిఫికెట్లు కావాలనుకుంటే ఇండియాలో ఉచితంగానే అందిస్తారు. విదేశాల్లో ఉండే భారతీయులు మాత్రం 15 డాలర్లు చెల్లించాలి. ఇండియాలో ఐడెంటిటీ సర్టిఫికెట్ ధర రూ.1,000గా ఉంటే, విదేశాలకు అయితే 50 డాలర్లు చెల్లించాలి.