CM Siddaramaiah | బెంగళూరు, సెప్టెంబర్ 29: కర్ణాటక బియ్యం అడిగితే మొండిచెయ్యి చూపించి.. సింగపూర్కు బియ్యం ఎగుమతి చేసేందుకు కేంద్రం సిద్ధమైందని ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య విమర్శించారు. పేదలు ఆకలితో అలమటిస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. బెంగళూరులో శుక్రవారం సిద్ధరామయ్య మాట్లాడారు. ‘కేంద్ర ప్రభుత్వం సింగపూర్కు బియ్యం ఎగుమతి చేస్తుంది. కానీ బియ్యం కావాలన్న కర్ణాటక అభ్యర్థనను మాత్రం తిరస్కరిస్తుంది.
బీజేపీ సర్కార్ రాజకీయాలు చేస్తున్నది. కర్ణాటకలోని పేద ప్రజలకు బియ్యం ఇవ్వడం లేదు. బియ్యం అందిస్తే నగదు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాం. అయినా ఇప్పటికీ బియ్యం అందించడం లేదు. పేదల ఆకలి తీర్చేందుకు బియ్యం ఇవ్వాల్సి ఉన్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. బీజేపీ, కేంద్ర ప్రభుత్వం పేదలకు వ్యతిరేకంగా పని చేస్తున్నాయి’ అని సిద్ధరామయ్య ధ్వజమెత్తారు. అన్న భాగ్య పథకం అమలు చేసేందుకు తమకు అదనపు బియ్యం కావాలని గతంలో కర్ణాటక ప్రభుత్వం కేంద్రాన్ని కోరగా.. మోదీ సర్కార్ బియ్యం ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే తాజాగా విదేశాలకు బియ్యం ఎగుమతులపై నిషేధం విధించిన విషయం విదితమే. కాగా, వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా సింగపూర్కు బియ్యం ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేయాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కేంద్రంపై విరుచుకుపడ్డారు.