న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం శనివారం ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన సుమారు రెండు నెలల తర్వాత దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పంకజ్ మిథాల్, పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కరోల్, మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పీవీ సంజయ్ కుమార్, పాట్నా హైకోర్టు న్యాయమూర్తి అహ్సానుద్దీన్ అమానుల్లా, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి మనోజ్ మిశ్రా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. రాష్ట్రపతి ముర్ము వారిని నియమించినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ మేరకు శనివారం ట్వీట్ చేశారు. సుప్రీంకోర్టు కొత్త జడ్జీలకు అభినందనలు తెలిపారు.
కాగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామక ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మధ్య గత రెండు నెలలుగా సుదీర్ఘమైన వాదోపవాదనలు, చర్చలు జరిగాయి. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఐదుగురు న్యాయమూర్తుల అపాయింట్మెంట్ను కేంద్ర ప్రభుత్వం జాప్యం చేసింది. దీంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎస్కే కౌల్, ఏఎస్ ఓకా దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి సంబందించిన రెండు పిటిషన్లపై విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘చాలా అసౌకర్యమైన స్టాండ్ తీసుకునేలా మమల్ని చేయవద్దు. మీరు మమ్మల్ని చాలా కష్టమైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తారు’ అని హెచ్చరించారు.
దీంతో దిగి వచ్చిన కేంద్రం కొత్త న్యాయమూర్తుల నియామకాన్ని రెండు రోజుల్లో క్లియర్ చేస్తామని సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో ఐదుగురు జడ్జీల అపాయింట్మెంట్ను శనివారం ఖరారు చేసింది. సుప్రీంకోర్టులో మొత్తం 34 మంది జడ్జీలు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం చీఫ్ జస్టిస్ సహా 27 మంది న్యాయమూర్తులు ఉన్నారు. తాజాగా ఐదుగురు కొత్తగా నియమితులు కావడంతో సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య 32కు పెరిగింది.
As per the provisions under the Constitution of India, Hon’ble President of India has appointed the following Chief Justices and Judges of the High Courts as Judges of the Supreme Court.
I extend best wishes to all of them. pic.twitter.com/DvtBTyGV42— Kiren Rijiju (@KirenRijiju) February 4, 2023